Thursday, July 24, 2025

ఆడబిడ్డలకు 200 కోట్ల జీరో టికెట్లు

- Advertisement -
- Advertisement -

విజయవంతంగా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణం
ఆర్‌టిసి కార్మికులు, సిబ్బందికి సిఎం అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలు తెలిపారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్‌టిసి కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి సిఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు : పొన్నం
రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేసిన మొట్టమొదటి మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్‌టిసిలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు రూ. 6,700 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. ఆర్‌టిసికి మహిళా ప్రయాణికుల రియింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తోందన్నారు.

ఆర్‌టిసిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన బస్సులు కొనుగోలు చేస్తూ మహా లక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్‌టిసి డ్రైవర్లు , కండక్టర్ లు , శ్రామిక్ లు , ఇతర సిబ్బందిని, అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్‌టిసి సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సా ధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూరపు ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఆర్‌టిసి వృద్ధి సాధించడానికి తోడ్పడడం అభినందనీయమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి మహిళా నెలకు 4-5 వేల రూపాయల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారన్నారు. ఆర్‌టిసిలో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపో లు , 341 బస్ స్టేషన్‌లలో బుధవారం సంబరాలు జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బస్ స్టేషన్లు, డిపోల్లో బ్యానర్ల ప్రదర్శించాలని, అన్ని డిపోలలో ముఖ్యమైన బస్ స్టేషన్లలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంబరాల కార్యక్రమాల్లో స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎంఎల్‌ఎలు, మేయరు,్ల విఐపిలను సమావేశానికి ఆహ్వానించాలన్నారు.

మహిళా ప్రయాణీకుల ప్రసంగాలను ఏర్పాటు చేయడం, కూరగాయల విక్రేతలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, వ్యాపార మహిళలు, పట్టణ ఆసుపత్రులకు మెరుగైన చికిత్స కోసం వెళ్లే మహిళలు, యాత్రికులు వంటి వివిధ వర్గాలకు చెందిన వారు తమ ప్రసంగాలలో తమ ప్రయాణ అనుభవాలను పంచుకోవాలని మంత్రి సూచించారు. డిపోలు, ముఖ్యమైన బస్ స్టేషన్లలో మహిళా ప్రయాణికులను శాలువా, బహుమతితో సత్కరించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించాలని, .పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్ సెట్లు మొదలైన బహుమతులతో 5 మంది బహుమతి గ్రహీతలను సత్కరించాలని మంత్రి పొన్నం సూచించారు. ఈ పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 మంది ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్‌లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News