మానవ సేవే మాధవ సేవగా పేర్కొంటారు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూడాలని ప్రవచన కర్తలు ఉద్బోధిస్తారు. అయితే సాటి మనిషిని మనిషిగా చూడలేని వర్తమాన సమాజంలో పాత సామెతలను, ఆర్యోక్తులను కొరగానివిగా భావిస్తున్నారు. కనీసం సొంత వారినే పట్టించుకోలేని నేటి వ్యవస్థను గూర్చి ఎంతగా బాధపడినా ప్రయోజనం శూన్యం. కనిపెంచిన వారి పట్ల కఠినత్వం ప్రదర్శించడం అమానుషత్వం కాదా? బతికుండగానే చావాలని కోరుకోవడం ఏ చదువు నేర్పిన సంస్కారం? తమ అభివృద్ధికి బాటలు వేసిన తల్లిదండ్రులను, పెద్దలను తృణీకారభావంతో చూడడం మనోక్లేశాన్ని కలిగిస్తున్నది. దారితప్పిన మనుషులు, గాడి తప్పిన చదువులు కేవలం ధనార్జన కోసమే పరుగులు పెట్టే యాంత్రీక యుగాన్ని సృష్టించి, మానవత్వాన్ని, సంస్కారాన్ని, బాధ్యతను గుదిబండలుగా మార్చేసాయి.
తల్లిదండ్రులను భారంగా(Burden parents) భావించే నేటితరం తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నది. మానవ జన్మకు పరమార్ధం మహిలో ఉన్నతంగా జీవించడమే. ఉన్నత జీవనమంటే కోట్లు గడించడం కాదు. వ్యక్తిత్వం తో వికసించడం. మూలాలను మరచిపోయి, సంస్కారం లోపించి, కృతజ్ఞత మరచి జీవించడం వలన జీవితానికి సార్థకత చేకూరదు. నేడు మనం అనుభవిస్తున్న జీవితం, సకల సుఖాలు ఎవరి వల్ల ప్రాప్తించాయో, వారిని కూరలో కరివేపాకులా తృణీకరించి ఆవలికి గెంటడం దుర్మార్గం.జన్మప్రదాతలను, జ్ఞానప్రదాతలను గౌరవించడంలోనే మన వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, వికసిస్తుంది. కనిపెంచిన వారిని నిర్లక్ష్యం చేయడం అమానుషం. అమ్మ ఆప్యాయత, నాన్న బాధ్యత పిల్లల ఉన్నతికి సోపానాలు. ‘నాస్తి మాతృసమం దైవం’ అన్న మాట అక్షరసత్యం. అవనికి అందం ‘అమ్మ’. అమ్మలేని సృష్టికి అర్ధం లేదు.
నవమాసాలు మోయడమే కాదు, నడకనేర్పి, నడత నేర్పి, ఆలనాపాలనా చూసి, లాలించి, గోరు ముద్దలు తినిపించి మన బతుకుకొక అర్ధం చెప్పి, బతుకు దెరువుకు మార్గం చూపించి మరబొమ్మలాంటి మనల్ని మనిషిగా తీర్చిదిద్దే మహిమాన్విత శక్తి కేవలం అమ్మకే స్వంతం. తల్లితో పాటు తండ్రి స్థానం మరువరాదు. కుటుంబ వ్యవస్థలో మమకారాలు నశించాయి. రక్తసంబంధాలు గాడితప్పాయి. పెద్దలపట్ల గౌరవం సన్నగిల్లింది. మనలో మానవత్వపు ఛాయలు మటుమాయమైన ఫలితమే వృద్ధాశ్రమాల ఆవిర్భావానికి మూలకారణం. మానవీయ విలువలు నేర్పని చదువులు నిరర్ధకం. విదేశీ వ్యామోహంలో, పరిపక్వత లేని ప్రేమల మాయా మోహంలోపడి తల్లిదండ్రులను, పెద్దలను అగౌరవ పరిచే ప్రబుద్ధుల బుద్ధులను సరిదిద్దే వారెవ్వరు? తమకోసం అహర్నిశలూ శ్రమించిన పెద్దలను పూచిక పుల్లల్లా తీసిపారేసే నైజం ప్రబలింది.
పెళ్లిళ్ళు కాగానే మాయామోహంలో చిక్కుకుని, పెద్దలను ‘ప్రైవసీ’ పేరుతో అత్యంత అమానవీయమైన రీతిలో నిర్లక్ష్యం చేస్తున్న యువతను చూస్తున్నాం. విదేశీ సంస్కృతిని అలవరచుకుని ‘తల్లిదండ్రుల దినోత్సవం’ పేరుతో సంవత్సరానికొకసారి మొక్కుబడిగా వారిని పరామర్శించడం అనాగరిక పోకడలకు నిదర్శనం. అవసాన దశలో అవయవాలు పనిచేయక, దిక్కూమొక్కూ లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో దారితెన్నూ దొరకని నైరాశ్యంలో అనాథలై ఆత్మహత్యల పాలవుతున్న అభాగ్యులకు వృద్ధాశ్రమాలే దిక్కవడం కడు శోచనీయం. వృద్ధాశ్రమాలు తిండి పెట్టగలవేమో గాని, తమ స్వంత ఇంట్లో ఉన్న సంతృప్తి వృద్ధాశ్రమాల్లో లభిస్తుందా? తమ కోసం సర్వం త్యాగం చేసి, చివరకు మెడబట్టి గెంటించుకునే దుస్థితి హృదయశల్యమే కదా! ఎవరికి వారే స్వార్ధబుద్ధులతో, సంకుచితమైన మనస్తత్వాలతో ప్రవర్తించడం అత్యంత హేయం.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిన నేపథ్యంలో ఎవరికి వారే గిరిగీసుకుని, తమ పరిధిలో తాము బతకాలనుకోవడం సంకుచితత్వం. ఈ ధోరణి మానవ సంబంధాలకు తిలోదకాలివ్వడమే. బంధాలకు, సంబంధాలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు చరమగీతం పలకడమే. ఎన్నో కష్టాలను అనుభవించి, తమ జీవితాలను ధారవోసి, చివరికి కన్నీళ్ళతో చెలిమి చేసి, కఠినాత్ముల చేతుల్లో కాలధర్మంచేస్తున్న వర్తమాన మానవ వికృత చర్యలను చూసిహృదయమున్న, చలనమున్న స్పందించే గుణమున్న ప్రతీ ఒక్కరూ చలించక తప్పదు. ప్రతీ ఒక్కరూ చక్కని వ్యక్తిత్వం కలిగి ఉండాలి. విచక్షణతో కూడిన స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సమర్ధత కలిగి ఉండాలి. ఇతరుల దర్శకత్వంలో నడుస్తూ, భ్రష్టులుగా, అసమర్ధులుగా మిగిలిపోయి, సమాజం దృష్టిలో చులకనకావడం వంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో నేటి ఆధునిక మానవ సమాజంలో చోటు చేసుకుంటున్నాయి.
ఇకనైనా మనం మేల్కొని, రేపు మన గతి కూడా ఇంతేనన్న స్పృహతో మెలగవలసిన అవసరం ఎంతైనావుంది. నేటి యువతరమే రేపటి వృద్ధతరమన్న కనీస పరిణితి నెలకొనాలి. విద్యార్ధి దశలోనే పెద్దలను ఎలా గౌరవించాలో, తల్లిదండ్రులను అవసానదశలో ఎలా సంరక్షించాలో పాఠ్యాంశాలలో చేర్చాలి- నేర్పాలి. బిడ్డల భవిష్యత్తు కోసం తపించి, శ్రమించిన తొలి గురువులు జన్మప్రధాతలు. ‘అలాంటి వారికి ముదిమి వయసులో జరుగుతున్న పరాభవాలు, ఈసడింపులు నీతిబాహ్యమైనవి. చదువుకున్నవారే పెద్దలను గౌరవించక, విస్మరించి, అనాథలుగా అవతలికి గెంటేయడం అత్యంత హేయం. నేటి సమాజంలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఒక వైపు వార్ధక్యం.. మరో వైపు అనారోగ్యం. ఇంకో వైపు ఆర్ధిక బాధలు వెంటాడుతుంటే ఒంటరి జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, బిడ్డలు ఉచ్ఛస్థితిలో ఉన్నా, తిండిలేక భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులెంతోమంది మనకు తారసపడుతున్నారు.
కనిపెంచిన వారు క్లేశాలు పడుతుంటే చలించని మనస్తత్వాలు శిలాసదృశాలు. మనిషి మరణించినా మనిషి ఆశయాలు సజీవంగా బతకాలి. బతుకుతూ మరణించడం కంటే మరణించి జీవించడం మేలు. భావితరాలకు వెలుగు నిచ్చే అనుభవ పాఠాలు పెద్దల వద్దనున్న నిగూఢమైన అస్తిపాస్తులు. భావితరాలకు ప్రతినిధులైన నేటి విద్యార్థులను సరైన దారిలో తీర్చిదిద్దే విద్యాధనం ఉపాధ్యాయుల వద్ద పుష్కలంగా ఉంది. జీవిత అనుభవాల సారాంశాన్ని ప్రబోధించే విలువైన సంపద పెద్దల వద్ద మెండుగా ఉంది. విద్యార్థులకు సరైన మార్గాన్ని నిర్దేశించి, వారిని క్రమశిక్షణ గల సైనికులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, గురువులు బాధ్యత తీసుకోవాలి. ఆనాడే తల్లిదండ్రుల పేరుతో జరుగుతున్న మనసులేని మనుషులు జరిపే కృత్రిమమైన ప్రచార ఆర్భాటాలకు స్వస్తి వాక్యం చెప్పగలం. గతించిన వారిని కలలో స్మరించడం వలన ఫలితం శూన్యం. ఎదిగిన బిడ్డలు తల్లిదండ్రుల హృదయాంతరంగాన్ని స్పృశించాలి. వారి ప్రేమాభి మానాలు, ఆశీర్వచనాలు బిడ్డల భవిష్యత్తుకు శ్రీరామరక్ష.
- సుంకవల్లి సత్తిరాజు
97049 03463