న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా ఆసియా కప్ 2025 భవిష్యత్తు అనిశ్చితిలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మెగా టోర్నమెంట్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని.. అంతేకాదు, షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఎసిసి) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ శనివారం వెల్లడించారు. యుఎఇ వేదికగా ఆసియా కప్ 2025ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు.
“యుఎఇలో ఎసిసి పురుషుల ఆసియా కప్ 2025 తేదీలను వెల్లడించడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగుతుంది. వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల అవుతుంది” అని నఖ్వీ పోస్ట్ చేశారు. జూలై 24న జరిగిన ఎసిసి సమావేశంలో ఈ ఈవెంట్ వేదికను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంకతో సహా ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి.కాగా, 2023లో ఫైనల్లో శ్రీలంకను ఓడించి టోర్నమెంట్ను గెలుచుకున్న టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది.