మన తెలంగాణ/ అమరావతి : తెలంగాణలో రిత్వి క్ కంపెనీకి రూ.1660 కోట్ల కాంట్రాక్ట్ వర్కుల కు సంబంధించి తనపై ఆ రోపణ చేయడం మూర్ఖత్వం అని బిజెపి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఖండించారు. శనివారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సిఎం రేవంత్ రెడ్డి తో కుమ్మక్కై తాను కాంట్రాక్ట్ పొందాననేది అ వాస్తవమని స్పష్టం చేశారు. అసలు ఆ కంపెనీకి తనకు సంబంధం లేదన్నారు.
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెలితో పోరు ఉన్నట్టే తెలంగాణలో కెటిఆర్కు కూడా చెల్లెలి పోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలల అయిందని, ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని ప్రశ్నించారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో తన ఇంటికి వచ్చిన కెటిఆర్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపిలో బిఆర్ఎస్ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారా? లేదా? స్పష్టం చేయాలన్నారు. తాను తమ పార్టీ పెద్దలతో చర్చించి, మీది అవినీతి పార్టీ అని… తెలంగాణలో మీ పని అయిపోయిందని , మీతో తమకు పని లేదని చెప్పడం వల్లే ఇలాంటి ఆరోపణ చేస్తున్నారన్నారు.
టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజారిటీతో నువ్వు ఎలా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా? అని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని అడిగితే తమ పార్టీకి కమ్మ కులస్థులు అవసరం లేదని, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత తమ పార్టీలో రెడ్లు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని మీరు నాతో చెప్పారా లేదా? అని గుర్తు చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి, టిడిపి పొత్తుతో పని చేస్తాయని అప్పుడు టిఆర్ఎస్ పుట్టగతులు ఉండవని తెలిసే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని, అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వారు ఎంతమంది? ఆంధ్ర వారు ఎంతమందన్నది తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే రండి మీరు చెప్పిన చేయటకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దాం అని సవాల్ విసిరారు.