తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ బిఆర్ఎస్ అని.. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ను బిజెపి పార్టీలో విలీనం చేస్తామని ఎంపి సిఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టడం, ఫ్యూచర్ సిటీలో రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే బిఆర్ఎస్ విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.సిఎం రమేష్, సిఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే..హెచ్సియు రూ. 10000 కోట్ల స్కాం పైనా..రూ.1,660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండింటిపైనా కలిసి తాను చర్చకు సిద్ధం అని ట్వీట్ చేశారు. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నదని మండిపడ్డారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి రూ. 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు..రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బిజెపి ఎంపి సిఎం రమేశ్కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు…ఇంతకన్నా దిగజారుడు రాజకీయం.. దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటదా..? అని ప్రశ్నించారు. సిఎం రేవంత్.. సిఎం రమేశ్ ఇద్దరి బాగోతం తాను బయటపెట్టడంతో కుడిదిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారని విమర్శింంచారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి రూ.1,660 కోట్ల కాంట్రాక్టు అట..అంటూ ఎద్దేవా చేశారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారని ఆరోపించారు. తాను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందని, దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్కు పనికి రాని కథలు చెబుతున్నారని మండిపడ్డారు.
రూల్స్ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకే సిఎం రమేష్కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..రూ. 1,660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందని వెల్లడించారు. ఇరకాటంలో పడిన ప్రతిసారి, ఇటు కాంగ్రెస్, అటు బిజెపి పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.