రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో చివరిసారిగా సర్వీస్ ఛార్జీలను సవరిస్తే, ఇప్పుడు మళ్లీ పెంపు చేపట్టడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కొత్త రేట్ల ప్రకారం, లైసెన్స్ సర్వీస్ చార్జీని రూ.200లు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ చార్జీ రూ.300లకు పెంచారు.
నాన్-ట్రాన్స్పోర్టు లైసెన్స్కు కొత్తగా రూ.400లు వసూలు చేయనున్నారు. దీంతోపాటు ఆటోరిక్షా ఫిట్నెస్ సర్టిఫికెట్కు రూ. 300లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం భారీగా పెరిగాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్ కొనుగోలు ధరపై 0.5 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనుండగా, నాన్-ట్రాన్స్పోర్టు వాహనాలపై 0.1 శాతం పెంపు అమల్లోకి వచ్చింది. ఆటో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250లకు చేరుకోగా, మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లకు పెరిగింది. దీనికి సంబంధించిన జిఓ 51ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ జారీ చేశారు.