బిసి బిల్లు కోసం 72 గంటల నిరాహారదీక్ష
ఆగస్టు 4 నుంచి 7వరకు ఇందిరా పార్క్ లో దీక్ష చేస్తా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసిలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు బిసి బిల్లుల కోసం అదే తరహాలో నిరాహారదీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని.. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ ఉంటే అక్కడే నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బిసి సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 4వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇందిరాపార్క్లోని ధర్నాచౌక్లో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. తెలంగాణ జాగృతి, యుపిఎఫ్ చేసిన పోరాటాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో బిసిల కోసం రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కానీ ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీనే పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పకుండా పార్టీ పరంగా ధర్నా చేస్తామని పిలుపునివ్వడం బిసిలను వంచించడమే అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం ఎందుకు చేయలేదు
రాష్ట్ర హైకోర్టు చెప్పింది కాబట్టి సెప్టెంబర్ నెలాఖరులోకా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని.. గడువులోగా ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. బిసిలకు రిజర్వేషన్ల కోటా పెంచడం కూడా అంతే ముఖ్యం అని ఎంఎల్సి కవిత అన్నారు. బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. తమిళనాడులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు న్యాయపోరాటం చేసి రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. ఆర్డినెన్స్ విషయంలో న్యాయపోరాటం ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రపతి బిల్లులకు ఆమోదం తెలిపితే సంతోషమని.. తెలుపకుండా రిజెక్ట్ చేస్తే మరోసారి శాసనసభ, శాసన మండలి ఆ బిల్లులకు ఆమోదం తెలిపితే రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని తెలిపారు. బిసి రిజర్వేషన్ల అమలు కోసం ఎన్నో అవకాశాలు ఉన్నా తన బడే భాయ్ నరేంద్ర మోదీని రక్షించడం కోసమే రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపించారు.