ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు
భూములు వాపస్ చేస్తామన్న
హామీని విస్మరించిన రేవంత్
ఫార్మా భూములను ఇతర
అవసరాలకు మళ్లించడం
నీచం రైతుల అనుమతి
లేకుండా సర్వే
జరపాలనుకోవడం దారుణం
రైతులకు భూములు వాపస్
ఇచ్చే వరకు బిఆర్ఎస్
పోరాటం మోసం, దగా,
నయవంచనకు మారుపేరు
కాంగ్రెస్ బిఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అంటేనే మోసం, ద గా, నయవంచన అన్న నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి తెలిసిందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని ర ద్దుచేసి భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం, ఇతర అవసరాలకు వాటి ని మళ్లించడం అత్యంత నీచమైన చర్య అని మండిపడ్డారు. అధికారం ఉం దన్న అహంకారంతో ప్రజల అనుమతి లేకుండా భూముల సర్వే జరపాలనుకోవడం ఫాసిస్టు చర్య అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మా భూము లు మాగ్గావాలె అని మర్లవడ్డ రైతులపై అక్రమ కేసులు పెడుతున్న రేవంత్ రాక్షసత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫార్మా రైతులను నిలువునా ముంచి అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి నిర్మిస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. అడుగడుగునా అన్నదాతలు మర్లవడుతున్నా, ఏకంగా ఎంఎల్ఎల ఇళ్లు ముట్టడిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్కి బుద్ది రావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం భూములను తిరిగి పొందే హక్కు ఉన్న రైతులతో ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఓవైపు ఫార్మా సిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, మరోవైపు కొనసాగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ ప్రభుత్వం, అటు ప్రజలను, ఇటు న్యాయస్థానాలను మోసం చేసిందని అన్నారు. ఫార్మా సిటీ రద్దయితే తమ భూములు తిరిగి వస్తాయని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొడుతున్న రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి వాతపెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని కెటిఆర్ హెచ్చరించారు.
రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది
లగచర్ల గిరిజన రైతుల భూములు, కంచె గచ్చిబౌలి అటవీ భూములు, అనుముల బ్రదర్స్ కోసం ఇప్పుడు ఫార్మాసిటీ అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా..రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని కెటిఆర్ అన్నారు. అబద్ధపు హామీలు ఇవ్వడం, యథేచ్చగా చట్టాలను ఉల్లంఘించడం, ప్రశ్నించిన వారిని వేధించడం, సిగ్గులేకుండా భూ కబ్జాలు చేయడమే మూల స్తంభాలుగా రేవంత్ ప్రభుత్వ పాలన నడుస్తుందని మండిపడ్డారు. అంతరించి పోయాయని అనుకున్న రాబందులు కాంగ్రెస్ నేతల రూపంలో తెలంగాణ ప్రజలను పీక్కు తింటున్నాయని చెప్పారు. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భూములు తిరిగి ఇచ్చేవరకు రైతుల పక్షాన బిఆర్ఎస్ ఉద్యమిస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు.