హైదరాబాద్: హస్తిన యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కెటిఆర్ తన ట్విటర్ లో పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్నారని, ఈయన ఢిల్లీ యాత్రలకు తెలంగాణకు ఏ సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు ఉన్నాయని, మొదటి పని ఫ్లైటు టికెట్ బుక్ చేయడమని, రెండో పని ఢిల్లీకి పోవడమని, మూడో పని ఖాళీ చేతులతో తిరిగి రావడమని ఎద్దేవా చేశారు.
రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదని, రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదని, సాగునీళ్లు రావని, తాగునీళ్లు లేవని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి కూడా లేదని, బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదని కెటిఆర్ విమర్శించారు.
‘రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు, జాబ్ క్యాలెండర్ల జాడ లేదని, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, తులం బంగారం ఊసు లేదు, రూ.4 వేల ఫించన్ జాడ లేదు, గురుకులాల గోడు పట్టదు, గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు’ అని చురకలంటించారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతున్నారని, దిగుతున్నారని, ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 50 సార్లు ఢిల్లీ యాత్రకు పోయారని, తెచ్చింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. శుష్కప్రియాలు శూన్య హస్తాలు అయిననూ పోయి రావలె హస్తినకు అని, ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? అని అడిగారు. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ దానికి బదులు దక్కింది మాత్రం ఫోటో షూట్లు, వీడియోలు, విందు రాజకీయాలు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి అని, ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సిఎం వద్దని కెటిఆర్ దుయ్యబట్టారు.