Sunday, August 3, 2025

మూఢ విశ్వాసాలు సంస్కృతిలో భాగమా?

- Advertisement -
- Advertisement -

ప్రతి జాతికి తమవైన ఆచార సంప్రదాయాలు, జీవనవిధానం ఉంటాయి. మానవ జాతి పురోగమనంలో భాగంగా ఏదో ఒక బలమైన సందర్భంలో ఓ కొత్త పద్ధతి వారి వ్యవహారశైలిలో కలిసిపోయింది. చెరువు కట్ట బలంగా ఉండటానికి ఒక దేవతను పూజించాలనో, ప్రజలు రోగాల బారిన పడకుండా ఒక దేవుడు కాపాడుతాడనో.. అనే జనం నమ్మిక ఒక ఆచారంగా మారిపోతుంది. ఇలాంటి ఆచరణలన్నీ జాతిసంస్కృతిలో భాగంగా పరిగణింపబడుతున్నాయి. ఈ విధానాలు అన్నీ ఆ జాతి గుర్తింపుగా పాటించడానికి తప్ప జీవన ఉన్నతికి తోడ్పడిన దాఖలాలు లేవు. ఆ ఆచరణలో భాగంగా నిర్వహించే పూజలు, బలులు, శాంతులు లాంటివన్నీ నమ్మికలో భాగమే. ఒక ఆచారం పుట్టుక వెనుక ఉన్న కథ వాస్తవమా లేక పుక్కిటి పురాణమా అనేది ఇప్పుడు అసందర్భం అయింది.

ఏ మతంలోని ఏ ఆచారమైనా, పండుగ అయినా, జాతర అయినా ఓ కట్టుకథ నుంచి పుట్టిందే. ప్రజల ఐక్యత కోసమో, సామాజిక ప్రయోజనం (Social benefit) కోసమో, ఒక మత విస్తరణ కోసమో, కొత్త దేవుడి ప్రచారం కోసమో, ఓ సాధువు గౌరవార్థమో వీటిని ఆరంభించి ఉండచ్చు. ప్రజలు అప్పులు చెల్లించడంలో అలసత్వం, మొండితనం ప్రదర్శిస్తున్న సమయంలో సత్య హరిశ్చంద్ర కథ సృష్టింపబడిందని ఓ వాదన ఉంది. భార్య బిడ్డలను అమ్మైనా అప్పు కట్టాలని, అందువల్ల దేవుడు ప్రసన్నం అవుతాడని ఆ కథ ప్రచారం చేసింది. స్వాతంత్య్ర పోరాటంలో జనం ఐక్యంగా కదిలేందుకు బాలగంగాధర తిలక్ వినాయకుడి నవరాత్రులు, నిమజ్జనం మొదలెట్టారని అంటారు. అదే విధంగా హోలీ, బతుకమ్మ, బోనాలు లాంటి సామూహిక పండుగల ఆరంభం వెనుక ఓ పురాణ నేపథ్యమో, సామాజిక ఏకీకరణ లక్ష్యమో ఉండి ఉంటుంది.

దసరా రోజున పాలపిట్టను చూడడం ఓ శుభసూచకంగా, జమ్మి ఆకును పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం గౌరవంగా భావిస్తుంటారు. అయితే ఈ ఆచార వ్యవహారాలు కూడా ప్రజల జీవన విధానాల్లో భాగంగా, సామరస్యంగా, ప్రశాంతంగా పాటించబడాలి. సంస్కృతి పేరిట కొంత మూఢత్వం ప్రచారం అవుతోంది. అస్తిత్వం, వివక్ష అనే విమర్శతో ఈ ఆచారాలను ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. ప్రజలు సాధారణ ధోరణిలో జరుపుకునే ఈ పర్వాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం లాంటి పదజాలాన్ని జోడించకూడదు. ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేయడం వల్ల ఇవి రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఒక జాతి ఆచారాలు, పండుగల నిర్వహణ ప్రభుత్వ బాధ్యత కాదు. దాని కోసం ఖజానా నిధులు, అధికార యంత్రాంగ వినియోగం అనవసరం. వాటికి ఆయా జాతుల ప్రజలే సొంత వనరులతో జరుపుకుంటారు.

తరతరాలుగా ఇలాగే అవి కొనసాగుతున్నాయి. బతుకమ్మ తెలంగాణ మహిళల ఇష్టమైన పండుగ. పూలతో బతుకమ్మను పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం ఓ సాంస్కృతిక సమారోహం. ఆ పాటల్లో స్త్రీల జీవితాలకు చెందిన గొప్ప సాహిత్యం ఉంది. ఆ పండుగ ఎలా పుట్టిందీ అనడానికి ఎన్ని కథనాలున్నా అవన్నీ అప్రస్తుతం. కొత్త బట్టలు, ఆట పాటలు, పుట్టింటికి ప్రయాణం, బంధుమిత్రుల ప్రేమపూర్వక ఆలింగనాలు, సుఖదుఃఖాల ప్రస్తావనలు ఇవన్నీ ఆడజన్మకు ఏడాదికోసారి దొరికే అపురూప కానుకలు. ఇవి చాలు బతుకమ్మను కొలవడానికి. తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ ప్రభుత్వం జనాన్ని ఆకట్టుకునేందుకు బతుకమ్మను ప్రభుత్వం తరపున నిర్వహించడం మొదలుపెట్టింది. స్టేడియంలో వేలాది మంది మహిళలతో బతుకమ్మ ఆటలు ఏర్పాటు చేసింది. బుక్ రికార్డుల కోసం ఊర్లో చేసుకొనే పండుగను నగర వీధుల్లోకి తెచ్చింది.

ఆఫీసుల్లో ఉద్యోగినులతో వాటి నిర్వహణ చేపట్టింది. నోరారా పాడే బతుకమ్మ పాటలను డీజే సౌండ్ గా మార్చింది. చప్పట్లు కొడుతూ ఆహ్లాదంగా సాగే తంతును దాండియా స్థాయికి తీసుకెళ్లింది. రాష్ట్ర నిధులను వెచ్చించి ప్రభుత్వం చేస్తున్న బతుకమ్మ వల్ల పండుగ అసలు రూపం కనుమరుగు అవుతోంది.బోనాలు జంట నగరాల్లో సాగే సామూహిక పర్వం. వాటి నిర్వహణ పిల్లలు జడుసుకొనేలా ఉంటుంది. వాయిద్య చప్పుళ్లతో నగరం మారుమోగిపోతుంది. బోనాలు ముగింపుగా ‘రంగం’ అనే భవిష్యవాణి పలికే కార్యక్రమం ఉంటుంది. నగరానికి చెందిన ఒక జోగిని కుటుంబంలోని స్త్రీలు వారసత్వ రీతిలో ఈ భవిష్యవాణిని వినిపిస్తున్నారు. మహంకాళి దేవత ఆవహించి ఆమెతో ఈ వాణిని పలికిస్తుందని భక్తుల నమ్మకం. ఈసారి ఆమె నోటి వెంట ‘తనకు రక్తం చూపించకపోతే ఊరుకోను’ అని మాట వినవచ్చింది. కొంతకాలంగా ఆ ఆలయంలో కోడి, మేక లాంటి జంతు బలులను నిషేధించారట. దానికి కోపగిస్తూ ‘నాలుగు కాళ్ల లేదా చిన్న జీవి అయినా సరే.. కొద్దిగానైనా రక్తం చూపించాలి’ అని ఆ మాతంగి పలికారు. దేవత ఆవహింపు అనే దానిని విజ్ఞానశాస్త్రం ఒప్పుకోదు.

ఇది ప్రజల భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ మంత్రి చివరగా మాట్లాడుతూ నిషేధించిన జంతు బలుల గురించి ప్రభుత్వం పరిశీలిస్తుందని, భవిష్యవాణిలో చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలు చేపడతామని అన్నారు. అలా రక్తం చూపించే బాధ్యతను మంత్రి తీసుకోవాల్సింది కాదు. ఈ మధ్య నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీళ్లు విడిచినప్పుడు ప్రభుత్వం తరఫున మంత్రి కృష్ణమ్మకు సారె సమర్పించినట్లు వార్తల్లో వచ్చింది. నదిని స్త్రీగా భావించి చీర, గాజులు, పసుపు కుంకుమలు ఆ నీటిలో వేయడం తెలంగాణ సంప్రదాయం. దానిని ప్రభుత్వ కార్యక్రమంలో భాగం చేయడం అసంబద్ధం. అశాస్త్రీయ, మూఢ నమ్మకాలను నమ్మడమనేది ప్రజల వ్యక్తిగత విషయం. వాటికి కూడా సంస్కృతిలో చోటు కల్పించకూడదు. సంస్కృతి జాతి ఉన్నతీకరణకు తోడ్పడాలి కానీ మూఢ నమ్మకాలను పెంచి పోషించకూడదు. ప్రభుత్వాలు కూడా ఈ విచక్షణతో పని చేయాలి.

– బద్రి నర్సన్ 94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News