బిసి సిఎం కావడం ఖాయం
బిసిల పదవులు కిషన్ రెడ్డి లాక్కున్నారు
23 నుంచి మళ్ళీ జనహిత పాదయాత్ర
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది తమ పార్టీ నుంచే సిఎం అవుతారని ఆయన శనివారం గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తెలిపారు. పదేళ్ళూ తానే సిఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం గురించి ప్రశ్నించగా, అలా చెప్పడంలో తప్పేమి లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు, పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించడానికి, పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహ పరిచేందుకు చెప్పి ఉంటారని ఆయన తెలిపారు. తనకు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఏమీ లేవని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిఎం చాలా మారారని, పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడడం వేరని అన్నారు.
బిసిల పదవులు లాక్కున్న కిషన్ రెడ్డి
బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఇద్దరు బిసి నాయకుల నుంచి పదవులు లాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణ చేశారు. బిజెపిబిఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బిసి నాయకుడైన బండి సంజయ్ నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిని, సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని బండారు దత్తాత్రేయ నుంచి కిషన్ రెడ్డి లాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భయంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడలేకపోతున్నారని ఆయన తెలిపారు. బండి సంజయ్, ఎంపిలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ మౌనం బిసిలకు నష్టమని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతునిచ్చిన బిజెపి ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నదని ఆయన విమర్శించారు. బిసి బిల్లును కేంద్రం ఆమోదించకుండా రాష్ట్ర బిజెపి అడ్డుపడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసి బిల్లు విషయంలో తమ నిజాయితిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సర్వే చేయిస్తున్నామని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని ఆయన చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బ్రేక్ చేశారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలను సునాయసంగా కైవసం చేసుకుంటుందని ఆయన ధీమాగా అన్నారు.
జోడో యాత్రలా… జనహిత యాత్ర
తాము చేపట్టిన జన హిత పాదయాత్ర గతంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర తరహాలో జరుగుతున్నదని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొనేందుకు జనహిత యాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చామని, ఈ నెల 23 నుంచి మళ్ళీ చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఈ పాదయాత్రను తాను చేపడితే కొంత మంది ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ పాదయాత్రగా ప్రచారం చేశారని ఆయన తెలిపారు. మలి విడత పాదయాత్రలో ఈ దఫా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. మొదట బస్సు యాత్ర చేయాలని అనుకున్నా, ఎక్కువ సంఖ్యలో ప్రజలను కలిసేందుకు వీలుగా పాదయాత్ర చేపట్టామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.