న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి మధ్య నాన్స్టాప్ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిలిపివేత అమలులోకి వస్తుందని పేర్కొంది. ఆపరేషనల్ పరిమితుల దృష్ట్యా ఈ రూట్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 26 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలకు రెట్రోఫిటింగ్ చేపడుతున్న కారణంగా విమానాల కొరత, అలాగే పాకిస్థాన్ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. విమానాల కొరతే అందుకు కారణం అని తెలిపింది.
గత నెలలో 26 బోయింగ్ 787 విమానాలు రెట్రోఫిట్ చేయడం ప్రారంభించినట్లు ఎయిరిండియా (Air India) పేర్కొంది. వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ విస్తృతమైన కార్యక్రమం వల్ల 2026 చివరి వరకూ ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు పాకిస్థాన్ గగనతలం మూసి ఉండటం వల్ల విమానాల సుదూర కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని తెలిపింది. ఆపరేషనల్ సమస్యల నేపథ్యంలో ఈ విమానాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డిసికి లేదా అక్కడి నుంచి ఢిల్లీకి టికెట్లు బుకింగ్ చేసుకొనే ప్రయాణికుల్ని సంప్రదించి.. వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది.