దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ క్రైమ్ రేటుతో పోలిస్తే తెలంగాణలో దాదాపు 10 రెట్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ షాకింగ్ విషయాలను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సిఆర్బి) మంగళవారం విడుదల చేసిన 2022 మధ్యంతర డేటా పేర్కొంది. ఎన్సిఆర్బి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున 4.8 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 40.3 శాతంగా నమోదైంది. దీంతో ఈ జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లైంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా క్రియాశీలంగా ఉన్నట్లు ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. తెలంగాణ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే, మహారాష్ట్రలో సైబర్ క్రైమ్ రేటు 6.6 శాతంగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 4.4, అసోంలో 4.9, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో 4.3 శాతం చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కేవలం 0.4 శాతం క్రైమ్ రేటుతో మెరుగైన స్థానంలో ఉంది.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ 3.2 శాతం, పుదుచ్చేరి 3.9 శాతం క్రైమ్ రేటుతో సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా మారాయి. ఢిల్లీ పోలీసుల డేటాననుసరించి 2024లో సైబర్ మోసాల ద్వారా ఢిల్లీ వాసులు రూ. 817 కోట్లు నష్టపోయారు. 2025లో జూన్ 30 నాటికి మొదటి ఆరు నెలల్లోనే రూ. 70.64 కోట్లు కోల్పోయారు. దేశంలో సైబర్ నేరాలను అరికట్టేం దుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల లోక్సభకు వెల్లడించారు. ఇందులో భాగంగా ’ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4C) ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో ఫిర్యాదుల కోసం ’నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ప్రారంభించామన్నారు. దీంతో పాటు, మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు పోలీస్ విభాగాల్లో ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.