న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) ఖండించారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదన్నారు. ఓటరు జాబితాను బూత్ లెవల్లోనే ప్రతి పార్టీ చూసుకుంటుందని పేర్కొన్నారు. సంస్కరణల్లో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని.. పౌరుల మధ్య ఇసి వివక్ష చూపదు అని అన్నారు. చట్టాలను ఇసి ఎప్పుడూ గౌరవిస్తుందని తెలిపారు. బిహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో ఓట్లు తొలగిస్తే అభ్యంతరాలు చెప్పవచ్చు అని.. సర్లో అన్నీ రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తామన్నారు. అబద్ధపు ప్రచారాలను పట్టించుకోమని.. ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిక ప్రక్రియలో లోపాలున్నా ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలుపవచ్చని సూచించారు. (Gyanesh Kumar)