తిరుమల : శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో ఆదివారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు.
ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్స్వామి, అదనపు ఇఒ సి.హెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఇఒ లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.