వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదుగురు
మహారాష్ట్రలోని ఓ బాబా వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘటన
హుటాహుటిన తరలివెళ్లిన కుటుంబ సభ్యులు
ముంబయి: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఆర్ నగర్ కు చెందిన నలుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. వరదలో కొట్టుకుపోయిన వారిలో షేక్ అఫ్రీన్ తన భర్త సలీం కు ఫోన్ చేసి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని రోధిస్తూ చెప్పిందని, తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని స్థానికులు తెలిపారు. వీరంతా బోధన్ కు సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని ఓ బాబా వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో అఫ్రీనా తో పాటు హసీనా, సమీనా, ఆఫ్రీన్, అబ్బు అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవర్ ఉన్నారు. వీరిలో అబ్బు వరద నీటి ప్రవాహం నుండి ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.