ఎంత పాత తెలుగు సినిమాలోనైనా నగలు తాకట్టు లేదా కొనే దుకాణాన్ని చూపే సన్నివేశంలో తలపై టోపీ పెట్టుకొని, వచ్చి రాని తెలుగు మాట్లాడే మార్వాడీనే చూపిస్తారు. అంటే తెలుగు ప్రేక్షకుడు ఆ వ్యాపారంలో మరొకరిని అంగీకరించడనే భావన అప్పుడే సినిమా వాళ్లలో ఏర్పడింది. మద్రాస్ వీధుల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలో ఇలా ఉందంటే సుమారు వందేళ్ల క్రితమే మార్వాడీలు ఈ రెండు రాష్ట్రాల్లో అలా స్థిరపడ్డారన్నమాట. డబ్బు, పెట్టుబడితో ముడిపడిఉన్న సకల వ్యాపారాల్లో వారు బ్రిటిష్ కాలంలోనే దేశమంతా విస్తరించారు. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఆ విస్తరణకు లోబడిన ప్రాంతాలే. యాభై, అరవై ఏళ్ల క్రితమే హైదరాబాద్లోని కోఠి ప్రాంతంలో మార్వాడీ భోజనాలయ్ ఉండేది. అందులో కేవలం ఉత్తరాది వంటకాలు వడ్డించినా అందరూ తినేవారు. ఆ హోటల్కు ఒక జాతిని తెలిపే పేరు పెట్టడంలో ఎన్నో అర్థాలున్నాయి.
ఇప్పుడైతే దేశంలో మార్వాడీ అంటే తెలియనివారు ఉండరని చెప్పవచ్చు. ఆ పదం కొన్ని సందర్భాల్లో విశేషణంగా కూడా వాడతారు. అధిక వడ్డీతో తీరని అప్పును (Bad debt) ‘అది మార్వాడీ వడ్డీ’ అని చెప్పుకుంటారు. వ్యాపార విషయాల్లో సాటి మనుషులతో మార్వాడీ నిర్దయగా, నిరంకుశంగా ఉంటాడనడానికి ఇవి తార్కాణాలు. అయితే ఈ కారణాలతో జాతి మొత్తాన్ని ఒక్క గాటన కట్టలేము. ఎందుకంటే దేశంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించిన బిర్లా, మిట్టల్, దాల్మియా, బజాజ్, జిందాల్ కుటుంబాలు కూడా మార్వాడీ సంతతే. అయినా సరే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఉద్యమాలను కూడా తప్పుపట్టలేము.. అసోం రాష్ట్రంలో ఆగస్టు, 13 న ఒక మార్వాడీ యువకుడు 17 ఏళ్ల అస్సామీ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానిక అస్సామీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.
రాజీపడిన ఆ యువకుడి కుటుంబం క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇంతటితో ఆగకుండా అస్సామీ సంఘాలు కొన్ని డిమాండ్లను కూడా మార్వాడీలు ముందుంచాయి. స్థానికుల భూములు కొనవద్దని, దుకాణాల్లో 90% అస్సామీలకే ఉద్యోగాలు ఇవ్వాలని, దుకాణాల బోర్డులను హిందీలో కాకుండా స్థానిక భాషలో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. డిసెంబర్ 2023 లో బెంగళూరులోని చిక్కపేటలో మార్వాడీలు దుకాణాల బోర్డు విషయంలో కన్నడ భాషను పట్టించుకోవడం లేదని, నామమాత్రంగా చిన్న అక్షరాలు వాడుతున్నారని కన్నడ సంఘాలు గొడవకు దిగాయి. చివరకు ఇంగ్లీషులో చిన్న, కన్నడంలో పెద్ద అక్షరాలతో దుకాణాల బోర్డులు మార్చక తప్పలేదు. పదేళ్ల క్రితం ఒడిశాలో ఓ సంఘటన మూలంగా మార్వాడీల ఆస్తుల ధ్వంసమే జరిగింది.
వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు వెళ్లిన యువకులతో ఓ మార్వాడీ దుకాణదారు అవమానకరంగా మాట్లాడడంతో ఈ గొడవ మొదలైంది. దాంతో స్థానికులపై పట్టింపులేని మార్వాడీలు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే నినాదం మార్మోగింది. ఈ సెగ బీహార్, పశ్చిమబెంగాల్కు కూడా పాకే ప్రమాదాన్ని రాజకీయ ప్రమేయంతో నిలువరించారు. 2021లో మెదక్ జిల్లా తూప్రాన్ లో ‘మార్వాడీ హటావో, తూప్రాన్ బచావో’ అనే ఆందోళన మొదలవగా స్థానిక అగర్వాల్ సంఘ నేతలు దీన్ని సామరస్యంగా పరిష్కరించారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగమని, సమాజానికి తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని చెప్పి వారు స్థానికులను శాంతింపజేశారు. తిరిగి ఇప్పుడు అమనగల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవారు స్థానికుల వ్యాపారాలను దెబ్బ తీస్తున్నారు.
మడిగెల కిరాయిలుపెంచి స్థానిక వ్యాపారుల షాపులు మూతబడేలా చేస్తున్నారని వారి వాదన. దీనికి నిరసనగా స్థానిక వ్యాపారస్థులు ఈ నెల 18న తలపెట్టిన అమనగల్ బంద్ అందరి దృష్టిలో పడింది. అయితే వివిధ కారణాల వల్ల బంద్ను వాయిదా వేసినట్లు వారు ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మార్వాడీ గో బ్యాక్ నినాదం సవ్వడి పెరుగుతోంది. ఈ మధ్య సికింద్రాబాద్లో పార్కింగ్ విషయంలో వచ్చిన గొడవలో మార్వాడీ వ్యక్తులు ఒక యువకుడిపై చేసిన దాడి ఇందుకు మూలమైంది. వివిధ స్థానిక అస్తిత్వ సంఘాలు, ఉద్యమకారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి మొత్తం మార్వాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రకటనలు ఇస్తున్నారు. స్థానికుల్లో పెల్లుబికిన ఈ విమర్శ, అసహనం నుండి మార్వాడీలను కాపాడేందుకు బిజెపి నేతలు, హిందుత్వవాద సంఘాలు ముందుకు వచ్చాయి.
మార్వాడీలపై అసహనానికి వాస్తవ కారణాలేంటి, వాటిని ఎలా సద్దుమణిగేలా చేయాలి అనే దిశలో నేతలు ఆలోచించకుండా మార్వాడీలు హిందూ సమాజ ధర్మపరిరక్షకులు అని బండి సంజయ్ కితాబునీయడం విచిత్రంగా ఉంది. స్థానిక హిందూ సంఘాల పెద్దలు, బిజెపి నేతలు కొందరు ఈ మార్వాడీ వ్యతిరేకతను పాకిస్తాన్ సృష్టి అంటున్నారు. కమ్యూనిస్టులు దీనికి వంతపాడుతున్నారు అంటున్నారు. రోహింగ్యాల ప్రస్తావన తెస్తున్నారు. ఈ మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టించడమే వారి ఉద్దేశం. మార్వాడీలు ఉత్తర భారత మూలాలున్నవారు. దేశాన్ని పాలించేవారు కూడా హిందువాద ఉత్తర భారతీయులే. స్థానికుల బాధను పట్టించుకుని మద్దతుగా నిలిస్తే ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తమ పార్టీకి వారి అంగ, అర్థబలం అవసరమని స్థానిక ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ బిజెపి ఇక్కడ రాజకీయంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ మార్వాడీ వ్యతిరేకతకు బిజెపి నేతలు ఎన్ని సాకులు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
- బద్రి నర్సన్ 94401 28169