సాగు పనుల్లో నిమగ్నమై ఉండాల్సిన అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కారు. పొద్దు మాపు అనే తేడా లేకుండా నిద్రహారాలు మాని యూరియా కోసం ప్రదక్షిణాలు చేస్తున్నా బస్తాలు లభించకపోవడంతో రోడ్డుపై బైఠాయించిన రైతులు పంటలకు సరిపడా యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద గల జాతీయ రహదారి 365పై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వీరికి మద్ధతుగా సిపిఎం మండల నాయకుడు బానాల రాజన్న ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బానాల రాజన్న మాట్లాడుతూ వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి కేంద్రం నుండి 9. 80 లక్షల టన్నులు యూరియా కేటాయిస్తే 6.60 లక్షల టన్నులు మాత్రమే మాత్రమే సరఫరా చేశారన్నారు. 4. 23 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందన్నారు. వర్షాకాల సీజన్ కొనసాగుతున్న సమయంలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ, పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచి అందించాలని కోరారు. యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఆర్పి ధరలకే అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుందని, ఆ ఆలోచనను విరమించుకొని సబ్సీడీ పెంచాలన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బొలగాని సతీష్ అక్కడికి చేరుకుని రైతులను శాంతింపజేయడంతో ఆందోళన విరమించారు.