ముఖ్యమంత్రి రేఖా గుప్తా(51)పై దాడి జరుగడంతో ఆమెకు కేంద్రం ‘జెడ్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఆమె అధికారిక నివాసం, క్యాంప్ కార్యాలయంలో కూడా పారామిలిటరీ బలగాలకు చెందిన విఐపి సెక్యూరిటీ గ్రూప్(విఎస్జి) భద్రత కల్పించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యతలను సిఆర్పిఎఫ్ తీసుకుంది. ఆమెకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారు. క్యాంప్ ఆఫీసులో బుధవారం ఉదయం ‘జన్ సున్వాయ్’ కార్యక్రమం జరుగుతుండగా రేఖా గుప్తాపై దాడి జరిగిందన్నది తెలిసిన విషయమే.
ఇప్పుడు ఆమెకు 24 గంటల పొడవునా పాతిక మంది సిఆర్పిఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు. సిఆర్పిఎఫ్ అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కర్ణాటక గవర్నర్లు వంటి హైప్రొఫైల్ వ్యక్తులకు కూడా భద్రత కల్పిస్తోంది. ఇదిలావుండగా 26వ ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపిఎస్ అధికారి సతీశ్ గోల్చా నియమితులయ్యారు. దీనికి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గోల్చా ప్రస్తుతం తీహార్ జైలు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆయన గతంలో ఢిల్లీ పోలీస్ డిసిపి, జాయింట్ సిపిగా కూడా పనిచేశారు. ఆయన ఎస్బికె సింగ్ స్థానంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.