Sunday, August 24, 2025

సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక భట్టి విక్రమార్కకు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ లేఖ రాశారు. సిరిసిల్లలోని పవర్‌లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. పవర్‌లూమ్ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ. 101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల ప్రాంతం పవర్‌లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, అక్కడ సుమారు 25 వేల పవర్‌లూమ్‌లు నడుస్తున్నాయని కెటిఆర్ లేఖలో వివరించారు. మారిన మార్కెట్ పరిస్థితులతో బతకలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చేందుకు తమ హయాంలో బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామని అన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్‌తో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరకడంతో పాటు స్థిరమైన ఆదాయం లభించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పవర్ లూమ్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

హైకోర్టు ఆదేశాలతో పెరిగిన భారం
కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 50 శాతం విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, అవగాహన లోపంతో ఎస్‌ఎస్‌ఐ యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ- 3 కేటగిరీ కిందకు వచ్చాయని కెటిఆర్ వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు, అలాగే 191 ఇతర యూనిట్లకు మొత్తం రూ. 35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్ లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు. పవర్ లూమ్స్‌కు ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ(సెస్) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్‌కు చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని వివరించారు. నేత కార్మికులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News