Monday, August 25, 2025

ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?.. రేవంత్ రెడ్డికి కెటిఆర్ సవాల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్టీ మారిన ఎంఎల్‌ఎలు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎంఎల్‌ఎలకు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా…? అని నిలదీశారు.

అభివృద్ధి-సంక్షేమంపై బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనల పోలిక
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కెటిఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్‌కు కేవలం ఇద్దరు ఎంఎల్‌ఎలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కెసిఆర్ సిఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపులలో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా అభివృద్ధి చేసి చూపించామని చెప్పారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కెసిఆర్ మార్చారని పేర్కొన్నారు. అందుకే 2023లో ఒక్క ఎంఎల్‌ఎ సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని అన్నారు.

హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం
హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కెటిఆర్ ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్‌లో సిఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా..? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చి వేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్‌ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కెటిఆర్ తెలిపారు.

కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కెసిఆర్ ఆ అప్పుతో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు,మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా..? అని అడిగారు. కెసిఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్‌ను కెసిఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు.

ఎంఎల్‌ఎలు తమవ స్వార్థం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారు
శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎంఎల్‌ఎలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కెసిఆర్ మీద, ఇంకో రోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని కెటిఆర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News