Wednesday, August 27, 2025

కావూరి హిల్స్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ సిటీ బ్యూరో ః నగరంలోని కావూరి హిల్స్‌లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జలమండలి నిర్ణయించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. వర్షం పడినప్పుడు స్థానికంగా సీవరేజీ ఓవర్ ఫ్లో జరుగుతూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇతర శాఖా అధికారులతో కావూరి హిల్స్ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఇక్కడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జలమండలి, ఇతర శాఖల అధికారులతో చర్చించారు. వరుస వర్షాల కారణంగా చెరువులోని నీటి మట్టం పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్)కు చేరుకోవడంతో డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో సమస్య ఏర్పడుతున్నట్టు అధికారులు ఎండీకి చెప్పారు. వర్షాల కారణంగా ఏర్పడిన డ్రైనేజీ ఓవర్‌ఫ్లోను అయన పరిశీలించారు. వెంటనే సీవరేజ్ లైన్‌లను డి-సిల్టింగ్ చేసి మురుగుకు అడ్డకట్టు వేయాలని అధికారులకు సూచించారు.

ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా శాశ్వత పరిష్కరానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు. మరోవైపు సమస్య పరిష్కారానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమీపంలోని భవణాలనుంచి ఉత్పన్నమయ్యే సీవ్రేజ్‌ను దుర్గం చెరువు ఎస్టీపీ ఐఎండి వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటి కాల్వలో మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాంటి పాయింట్లను గుర్తించి వర్షపు నీటి కాల్వ నుంచి సీవరేజ్ లైన్ ను వేరు చేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. దుర్గం చెరువు అవుట్ లెట్ వద్ద ఉన్న స్లూయిస్ వాల్వ్ లను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

దుర్గం చెరువు ఎస్టీపీని సందర్శన
గతంలో ప్రారంభమైన దుర్గం చెరువు వద్దనున్న 7 ఎంఎల్డీల సామర్ధ్యమున్న మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. మురుగునీరు శుద్ది ప్రక్రియను ఎండీ పరిశీలించారు. ఎస్టీపీల్లో ఇన్ లెట్, అవుట్ లెట్ ను పరిశీలించిన ఎండీ అనంతరం ఎస్టీపీ పర్యవేక్షణ ఆన్ లైన్ లో పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన స్కాడా రూమ్ ని సందర్శించి స్కాడా పనితీరు పరిశీలించి ఆన్ లైన్ లో అందుబాటులో ఉండే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఎస్టీపీల పనితీరు, వస్తున్న ఇన్ ఫ్లో, శుద్ధి చేసిన నీటి నాణ్యత వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రధాన కార్యాలయంలో డాష్ బోర్డు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీలో పరిసరాలను శుభ్రంగా ఉంచి అవకాశం ఉన్న చోట మొక్కలను పెంచి ఎస్టీపీ సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎమ్ లు పద్మజ, నారాయణ, జీఎంతో పాటు జలమండలి, జిహెచ్‌ఎంసి లేక్ డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News