ఢిల్లీ: తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రతి తల్లినీ కాంగ్రెస్, ఆర్జెడి అవమానించిందని విమర్శలు గుప్పించారు. తన తల్లిపై రాజకీయ విమర్శలపై ప్రధాని మోడీ స్పందించారు. చనిపోయిన తన తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగారని దుయ్యబట్టారు. దూషణలు కేవలం తన తల్లిని అవమానించడమే కాదు అని, దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఈ దృశ్యాలు చూసి, మాటలు విని, బిహార్లోని ప్రతి తల్లికి ఎంత బాధ కలిగిందో తనకు తెలుసునన్నారు. తన హృదయంలో ఎంత వేదన ఉందో, బిహార్ ప్రజల హృదయాల్లో కూడా అంతే బాధ ఉందని మోడీ వివరించారు. తల్లి అనేది మన లోకం, మన ఆత్మగౌరవమని చెప్పారు. సంప్రదాయాలతో నిండిన బిహార్లో ఇలా జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. బిహార్లో మహిళా స్వయం సహాయ సంఘాలకు వ్యాపార నైపుణ్యాలను నేర్పించడంతో పాటు వారి అభివృద్ధి సహాయం చేస్తామని, వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మోడీ పేర్కొన్నారు.