బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్ఫుల్నెస్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్ – సన్ రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2025 ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కోర్టులో పడిన ప్రతిసారీ లేచి నిలబడే షటిల్ జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రకాష్ పదుకొనె, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్, చిరాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రీడాకారులు బ్యాడ్మింటన్లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు.
అలాంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా, దేశం కోసం ఆడాలని యువ క్రీడాకారులకు సూచించారు. మీ క్రమశిక్షణే అసలైన కోచ్ అని, నిరంతర పరిశ్రమే అసలైన స్పాన్సర్ అని, ఆత్మ విశ్వాసం, గెలవాలనే పట్టుదలే మీ అసలైన బలం అని వారికి మార్గ నిర్దేశం చేశారు. తెలంగాణను గ్లోబల్ స్పోరట్స్ హబ్ గా మార్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల ప్రపంచ స్థాయి సౌకర్యాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, టీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, బీఏటీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.