హైదరాబాద్: ప్రేమ పెళ్లి వద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాళ్లపల్లి తండాలో ధనావత్ స్వరూప, కేశ్యనాయక్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మూడో కూతురు సక్కుబాయి(21) ఎంబిఎ పూర్తి చేసి గ్రూప్-2 ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది. హైదరాబాద్లో హాస్టల్లో ఉండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతోంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్తో పరిచయం కావడంతో ప్రేమగా మారింది.
అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వరసకు అన్న అవుతాడని పెళ్లి చేయడం కుదరదని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. హైదరాబాద్కు వెళ్లి ఉద్యోగం చేస్తానని చెప్పడంతో తండ్రి వద్దని వారించాడు. దీంతో మనస్తాపంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఈ సెప్టెంబర్ 1న కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లిపోవడంతో ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే అతడు ఇంటికి చేరుకొని కూతురును నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.