బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లేకుంటే ఆ పార్టీ మనుగడలో ఉండదని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్య చేశారు. శుక్రవారం అసద్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. కెసిఆర్ అంటేనే బిఆర్ఎస్, బిఆర్ఎస్ అంటేనే కెసిఆర్ అని ఆయన తెలిపారు. కెసిఆర్ లేకపోతే బిఆర్ఎస్ ఉండదని ఆయన చెప్పారు. అంతకుముందు అసద్ మహారాష్ట్ర కార్యవర్గంతో సమావేశమై మంతనాలు జరిపారు. ముంబయి, పుణే, నాగ్పూర్, ఔరంగాబాద్,
నాసిక్, ఔరంగాబాద్, పర్బనీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీని మరింత బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ దళితులు, మైనారిటీల సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిజాయితీపరులను ఎంపిక చేయాలని, ఎన్నికైన తర్వాత పార్టీ ఫిరాయించని వారిని గుర్తించాలని ఆయన సూచించారు. మజ్లీస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఇంతియాజ్ జలీర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.