Saturday, September 6, 2025

ఉపపోరు ఖాయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బం గారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ, గతంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు పరిపాలన చేతకావడం లేదని, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని సిఎం నేరుగా చెప్పాలని అన్నారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ నివాసంలో బాన్సువాడ ని యోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఎంపిటిసిల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపిపి కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్‌పిటిసి బాన్సువాడ నార్ల రత్నకుమార్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేష్, మాజీ కో-ఆప్షన్ హకీమ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, నామ నాగేశ్వర్‌రావు, మాజీ ఎంఎల్‌ఎలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే ప్రజల నుంచి సంపూర్ణ వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. హామీల వైఫల్యం, నమ్మకద్రోహం ఒక కారణం అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల తీరు, వ్యవహార శైలి మరో ప్రధాన కారణమని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిక్షణం కెసిఆర్ పేరు తలుచుకుంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

బాన్సువాడలో పోచారం ఓడిపోవడం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కెటిఆర్ అన్నారు. స్పీకర్ లేదా ఫిరాయింపుదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఆరు నెలల కాలంలో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. పోచారం ఎంఎల్‌ఎ పదవి పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని, కానీ బిఆర్‌ఎస్‌లో ఉన్న ప్రతి కార్యకర్త గర్వంగా తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని చెప్పుకోవచ్చని అన్నారు.

ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తోంది
ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, గత ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని కెటిఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం కేవలం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. అయితే, ఈ 21 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2.20 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిందని, ఆ అప్పుతో ఏ ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తోందని ఆరోపించారు. యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని కెటిఆర్ అన్నారు. పంటల కొనుగోళ్లకు, ఆ తర్వాత వాటికి ఇవ్వాల్సిన బోనస్‌ను ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే యూరియా సరఫరా చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News