కర్నాటక, హర్యానాలను అధిగమించి
తెలంగాణ అగ్రస్థానం వ్యవసాయ,
పారిశ్రామిక,సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధి
ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు,
వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిరిగా
రుణాలు ఇవ్వండి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల
సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వ్యక్తి ఆదాయంలో రూ. 3.87 లక్షలతో ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ అగ్రస్థానాన్ని సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుందని చెప్పారు. ఆస్తుల తాకట్టు పెట్టాలని, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని రైతులను ఒత్తిడి చేయవద్దని, బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
మొదటి క్వార్టర్లోనే 33.64 శాతం
2025 -26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణాల విభాగంలో మంచి ఫలితాలు సాధించటం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. ప్రాధాన్య రంగంలో వార్షిక రుణ ప్రణాళిక రుణ లక్ష్యాల్లో మొదటి త్రైమాసికంలోనే 33.64శాతం సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం నిరంతరం అధిక సిడి రేషియోను కొనసాగించడం గర్వకారణమని, ఈ త్రైమాసికంలో ఇది 126.50 శాతంగా ఉందని వివరించారు.
బ్యాంకులు మరింత సహాయం అందించాలి
ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలను సాధికారత కల్పించేందుకు, ఆదాయ సృష్టి చేసే కార్యకలాపాలకు బ్యాం కులు మరింత రుణ సహాయం అందించాలని కోరారు. హ్యామ్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణానికి ఇది ప్రారంభం అన్నారు. ఇది రాష్ట్రానికి మరింత మౌలిక వసతులు అందించి కొత్త స్థాయికి తీసుకు వెళుతుందని, ఈ ప్రాజెక్టులో బ్యాంకులు చురుకు గా పాల్గొనాలని కోరారు. బ్యాంకులు మరింత దృష్టి పెట్టి, క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కవరేజ్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలను పెంచాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని రైతులకు సకాలంలో, పెద్ద ఎత్తున బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. రాష్ట్రంలో మొదటి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బ్యాంకర్లను కోరారు.