Tuesday, September 9, 2025

100రోజుల్లో మేడారంలో అభివృద్ధి పనులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని దేవాలయా ల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించడంతో పాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిఎంకు వివరించారు.

మేడారానికి వస్తా
మేడారం మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యం గా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సిఎం రేవంత్‌రెడ్డి, పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
భక్తులకు సౌకర్యంగా ఉండే లా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీ గా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూ పొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించా రు. అలాగే బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి సిఎం పలు సూచనలు చేశారు.

ఆలయ ఆధునీకరణ పనులు చకచకా సాగాలి: పొంగులేటి
గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ జరగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సోమవారం మంత్రి పొం గులేటి సచివాలయంలోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి సమీక్షించారు. ఇప్పటికే మేడారం ఆలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారని, మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆదేశించారని మంత్రి తెలిపారు.

సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అడ్లూరి
సమ్మక్క-సారక్క జాతర నిర్వహించేందుకు రూ. 150 కోట్ల నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన అన్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద అని, రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News