కాళోజీ తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమ ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ. నిజాం దమననీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ సెప్టెంబరు 9, 1914 ‘కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న‘గా సుపరిచితులు.
1914, సెప్టెంబరు 9న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, తరువాత సిటీ కాలేజీలోనూ, హన్మకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు.
1939లో హైదరాబాదులో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించారు కాళోజీ.
వరంగల్లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టబడింది. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి- అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1948 ఆగస్టు 28న రజాకార్ల ఆకృత్యాలకు బైరాన్ పల్లిలో బలైన వారిని స్మరిస్తూ… తను రాసిన అక్షరాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన కొంపలార్చిన/ మనస్త్రీలను చెరిచిన/ మన పిల్లలను చంపి/ మనలను బందించిన/ మానవవాదులను/ మండలాదీశులను మరిచిపోకు/ గుర్తుంచుకోవాలి/ కసి ఆరబోకుండా కుబుసాన్ని నింపుకోవాలి. కాలంబూ రాగానే కాటేసి తీరాలే… అంటూ ఆయన కలం నుంచి వచ్చే ప్రతీ అక్షరం చైతన్యాన్ని రగిలించేది./ తెలుగు బిడ్డవురోరి.. తెలుగు మాట్లాడుటకు.. సంకోచొడతావు.. సంగతేమిటిరా.. అంటూ … తెలుగు భాషపై మమకారాన్ని ప్రశ్నించారు. ప్రజాజీవితంలో అన్యాయాలపై తన సిరా చుక్క చైతన్యాన్ని రగిలించిన కాళోజీ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది.
అలాగే ప్రముఖ కవులకు కాళోజీ పేరిట అవార్డులను అందజేసి సత్కరిస్తుంది. తొలగి తోవనిచ్చు వాడు ఎవ్వడు…తోసుకుపోవాలి గానీ…అంటూ తెలంగాణ సమాజం కోసం తన రచనల ద్వారా మేల్కొల్పిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు. ఆయన బతుకంతా తెలంగాణ కోసమే. కాళోజీ అనగానే ‘నా గొడవ’ గుర్తుకొస్తుంది. ‘నా గొడవ’ అంటే వ్యక్తిగతమైంది కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నారు కాళన్న. ‘అన్యాయాన్నెదిరిస్తే/ నా గొడవకు సంతృప్తి/ అన్యాయం అంతరిస్తే/ నా గొడవకు ముక్తి ప్రాప్తి/ అన్యాయాన్నెదిరించినోడు/ నాకు ఆరాధ్యుడు’ అని కాళోజీ చెప్పేవారు. సమాజమే కుటుంబంగా.. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరాల రూపంలో… తెలంగాణ ప్రజల బతుకులను వివరించిన మహనీయుడు… తెలంగాణ కోసం అలుపెరగని అక్షరాల ఉద్యమం చేసిన మహనీయుని త్యాగానికి శతకోటి… వినమ్ర నివాళులు.
సంపత్ గడ్డం
78933 03516