పంజాబ్లోని లుథియానాకు చెందిన సిమ్రన్జిత్ సింగ్ (Simranjeet Singh) ఊహించని పరిస్థితుల్లో యూఎఇలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతను యూఎఇ క్రికెట్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆసియా కప్లో తొలి మ్యాచ్లో యుఎఇ భారత్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో సిమ్రన్జిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీం ఇండియా టి-20 వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్తో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నాడు. గిల్కు చిన్నప్పుడు నెట్స్లో బౌలింగ్ వేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే తను ఇప్పుడు గిల్కి గుర్తున్నానో లేదో అని అన్నాడు.
‘‘2011-12లో మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ మైదానంలో ఆరు నుంచి పదకొండు వరకు మేము ప్రాక్టీస్ చేసే వాళ్లం. గిల్ వాళ్ల నాన్నతో కలిసి పదకొండు గంటలకు అక్కడకు వచ్చే వాడు. నేను కాసేపు ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడిని. దీంతో గిల్కి నేను బౌలింగ్ చేసేవాడిని. అయితే ఇప్పుడు గిల్ నన్ను గుర్తుపట్టగలడో లేదో తెలియదు’’ అని సిమ్రన్జిత్ పేర్కొన్నాడు. 2021 ఏప్రిల్లో దుబాయ్లో 20 రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేసే అవకాశం తనకు వచ్చిందని.. అయితే అప్పుడు కోవిడ్ రెండో దశ తీవ్రస్థాయికి చేరుకోవడంతో భారత్లో మళ్లీ లాక్డౌన్ విధించారని.. అందువల్ల తాను దుబాయ్లోనే మరి కొన్ని నెలలు ఉండిపోవాల్సి వచ్చిందని సిమ్రన్జిత్ (Simranjeet Singh) తెలిపాడు.
‘‘అప్పటి నుంచి దుబాయ్లోనే సెటిల్ అయ్యాను జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడంతో మంచిగానే సంపాదించాను. మరోవైపు క్లబ్ క్రికెట్ కూడా ఆడేవాడిని. అలా నా కుటుంబాన్ని పోషించుకునే వాడిని. ఈ క్రమంలోనే యుఎఇ జట్టులోకి వచ్చాను. వాళ్లు నాకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. దీంతో నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైంది’’ అని సిమ్రన్జిత్ అన్నాడు.
Also Read : ఇండియన్ రింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్యామ్సుందర్