మన తెలంగాణ/హైదరాబాద్: అనుకోనివిపత్తు తో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని సిఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్కు అందచేశారు. అలాగే తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి తా ము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు సీఎం వివరించారు.
ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగిలిన పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్ధులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21వేల కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.9వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతోపాటు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకు వచ్చిందని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిన నేపధ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్కు అనుమతించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అంతకు ముందు పార్లమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.
నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : రీజనల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి ఆర్థిక క్యాబినెట్ అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనల డీపీఆర్కు అనుగుణంగా రీజిన్ల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. రావిర్యాల, ఆమన్గల్ మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల రహదారిగా నిర్మించాలని కోరారు. మన్ననూర్ శ్రీశైలం (ఎన్ హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్- మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.