ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం జీవన్దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖాన్లలో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జూబ్ల్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ నిమ్స్, గాంధీ, ఉస్మానియాలతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవమార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని,
సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో ఆర్గాన్కు ఒక్కో టీమ్ ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవమార్పిడి సర్జరీలను ప్రోత్సహించే విధంగా ఈ బృందాలు పనిచేయాలన్నారు. ఇటీవల కేంద్ర చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నందున అందుకు అనుగుణంగా కొత్త నియమ నిబంధనల రూపకల్పనపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతో పాటు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు దానం చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనని ఈ నిబంధనను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తోట యాక్ట్ ప్రకారం ఆర్గాన్ స్వాపింగ్కు కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి రాజనర్సంహ సూచించారు. ఈ యాక్ట్ ప్రకారం ఇరువురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆర్గాన్స్ డొనేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
స్వాపింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్న నిబంధనలను పరిశీలించి, బాధితులను ఆదుకునే విధంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్దాన్ కోఆర్డినేటర్, డాక్టర్ భూషన్రాజుకు మంత్రి సూచించారు. దీనికోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను ఇతరులకు డొనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలని కోరారు.
ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవమార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లోని ఎంఎన్జే హాస్పిటల్ ఇంచార్జ్ డైరెక్టర్గా డాక్టర్ జోసఫ్ బెంజమిన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.