వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో భారీ వర్షాలతో జరిగిన నష్టం, ఇప్పటివరకు తీసుకున్న సహాయక చర్యలపై ఆయన శాఖల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్థి నష్టం తగ్గిందని అన్నారు.
సహాయక పనులను మరింత వేగవంతం చేయాలని, ఇప్పటివరకు పరిహారాలను విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క బాధితుడు పరిహారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, రోడ్ల మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరద సహాయానికి సంబంధించి వినియోగించిన నిధులకు యూసీలకు కేంద్రానికి అందించడంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ సమావేశంలో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీలోగా ఆయా విభాగాలు యూసీలను సమర్పించాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, హెల్త్, మున్సిపల్, ఆర్అండ్బి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిజమైన జర్నలిస్టులకు మేలు జరగాలి : నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్రెడ్డి, ఐఅండ్పిఆర్ స్పెషల్ కమిషనర్ సి.హెచ్ ప్రియాంక, సిపిఆర్ఓ మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హై పవర్ కమిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్థిక శాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.