Thursday, September 11, 2025

నేపాల్‌లో ఆర్మీ కర్ఫూ.. భారత సరిహద్దులో హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

ఖాట్మండ్: నేపాల్‌లో ఆర్మీ కర్ఫూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ బుధవారం నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న భారత్… సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామాచేసిన తరువాత తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను ఆర్మీ తీసుకుంది. ఈమేరకు సైనికులు రాజధాని ఖాట్మండ్ వీధుల్లో పహారా కాస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. ఈ కర్ఫూ వేళ.. విధ్వంసం, దోపిడీ, దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సరిహద్దుల్లో భారత్ భద్రత పెంపు
నేపాల్ ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మనదేశం భద్రతను పెంచింది. భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ పోలీస్ దళం సహస్త్ర సీమా బల్ భద్రతను పర్యవేక్షిస్తోంది ” అని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూగబోయాయి. తమ రోజువారీ జీవనానికి ఆటంకం ఏర్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జెన్‌జడ్ డిమాండ్లు ..
ఈ యువతరం (జెన్ జడ్ ప్రోటెస్టర్స్) నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా కొన్ని డిమాండ్లను ముందుంచింది. “ ఈ ఉద్యమం ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కాదు. మొత్తం ఒక జనరేషన్, దేశ భవిష్యత్తు కోసం కొత్త రాజకీయ వ్యవస్థ ఆధారంగానే శాంతి నెలకొంటుంది. అధ్యక్షుడు, నేపాల్ సైన్యం మా ప్రతిపాదనలను సానుకూలంగా అమలు చేస్తుందని భావిస్తున్నాం ” అని ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. అలాగే ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగాన్ని పారదోలేందుకు వలసలు అరికట్టేందుకు, సామాజిక అన్యాయాన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వీరి బృందం ఆర్మీ ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడిని కలవనుంది.

Also Read: నేపాల్‌లో భారత టూరిస్ట్ ఆవేదన..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News