నాణ్యమైన విద్య అనేది ఉపాధ్యాయుని సమర్థతపై ఆధారపడి ఉంటుంది.ఇతర వృత్తులతో పోలిస్తే ఉపాధ్యాయ వృత్తి విభిన్నమైంది. మంచి నైపుణ్యాలున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విపరీతంగా డిమాండ్ ఉంది. వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకున్నప్పుడే ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ముఖ్యంగా తరగతి బోధన, కృత్యాల నిర్వహణ, పిల్లల మనస్తత్వం, పాఠశాల నిర్వహణ, ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు తదితరాంశాలపై అవగాహన ఉండాలి. ఇవన్నీ బిఎడ్, డిఎడ్ వంటి ఉపాధ్యాయ వృత్తి కోర్సులో నేర్పిస్తారు. ఈ కోర్సులను అందించడానికి దేశవ్యాప్తంగా అనేక కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో వెలిశాయి. ప్రతియేటా లక్షలాదిమంది అభ్యర్థులు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందుతున్నారు. కానీ మెజారిటీ అభ్యర్థులలో నైపుణ్యాలు కొరవడుతున్నయని విద్యావేత్తలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉపాధ్యాయ విద్యలో సంస్థాగత లోపాలే.
నైపుణ్యం లేని ఉపాధ్యాయుల నియామకం వలన పాఠశాల విద్యలో నాణ్యత లోపిస్తుంది. కావున నాణ్యమైన విద్యనందించడానికి బోధన ప్రమాణాలను మెరుగుపరచాలని విద్యాహక్కు చట్టం- 2009 సిఫార్సు చేసింది. ఈ చట్టం సిఫార్సు మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( ఎన్సిటిఇ) మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రాలకు పంపించింది. ఇందులో భాగంగానే ఒకటి నుంచి 8వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేశారు. ప్రస్తుతం 2011నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.గతంలో ఒకసారి టెట్ పాస్ అయితే కాలవ్యవధి ఏడు సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి జీవిత కాలం అర్హతగా మార్చారు. ఇటీవల 2010 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో నియామకమైన వారందరూ ఉద్యోగంలో కొనసాగేందుకు, పదోన్నతి పొందేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తప్పనిసరి ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2010 కంటే ముందున్న ఉపాధ్యాయులు అదే కేడర్లో ఉండాలనుకుంటే మాత్రం టెట్ ఉత్తీర్ణత అవసరం లేదు.
పదవీ విరమణకు ముందు ఐదేళ్లకుపైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత కావాలని ఆదేశించింది. టెట్ అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు పదవీ విరమణ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది. అయితే పదవీ విరమణకు ముందు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు మాత్రం టెట్ లేకుండానే సర్వీసులో కొనసాగడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. వాస్తవంగా 2010లో ఎన్సీటీఈ ఒకటి నుంచి 8వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు టెట్ పాసవడం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో టీచర్లుగా నియమితులైనవారు కూడా ఐదేళ్ల లోపు టెట్లో ఉత్తీర్ణులు కావాలని సమయం ఇచ్చింది. తర్వాత ఈ గడువును మరో నాలుగేళ్లకు పొడిగించింది. కాగా, ఎన్సిటిఇ నోటిఫికేషన్ని సవాలు చేస్తూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 2011 జులై 29 లోపల టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీసులో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాసు హైకోర్టు 2025 జూన్లో తీర్పు ఇచ్చింది. అయితే పదోన్నతి కోసం టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని స్పష్టం చేసింది. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరని స్పష్టం చేయడంతోపాటు టెట్ పదోన్నతులు పొందినవారు రెండేండ్లలోపు ఉత్తీర్ణత కావాలని తీర్పునిచ్చింది.
ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పు దేశమంతటా వర్తిస్తుంది. పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యకతను గుర్తించి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి టెట్ అవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) 2020 ప్రకారం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, నైపుణ్య ఆధారిత విద్యపై దృష్టి సారించాలని సిఫార్సు చేసింది. కావున ఉపాధ్యాయుల సామర్థ్యాలను మరింతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని విద్యావేత్తల అభిప్రాయం. ఈక్రమంలో ఉపాధ్యాయ నియామకంలో టెట్ అనేది కనీస అర్హత పరీక్ష. నైపుణ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది. టెట్ను కొన్ని రాష్ట్రాలు ఉపాధ్యాయుల నియామకానికి వాడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు నియామకంలో వెయిటేజీ ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు అర్హత పరీక్షగానే పరిగణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డిఎస్సి)లో టెట్కు 20% వెయిటేజ్ ఇస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 నుంచి నియామకమైన ఉపాధ్యాయులంతా టెట్ అర్హత గలవారే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులు కావలసి ఉంది. తమిళనాడులో ఇప్పటికీ కేవలం 4.5 శాతమే ఉపాధ్యాయులు టెట్ క్వాలిఫై అయ్యారు. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా టీచర్లు సంఖ్య కోటి దాటగా, టెట్పాస్ కావాల్సిన వారు లక్షల్లో ఉండవచ్చనీ అంచనా. వాస్తవంగా 2010 ఎన్సిటిఇ నిబంధనలను విద్యాశాఖ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు చెప్పకపోవడం వల్ల చాలామంది టెట్ రాయలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ వారి వృత్తికి, ప్రమోషన్కు ఇబ్బందిగా మారింది. కావున సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి. ఇంకా పాఠశాల విద్యాశాఖ టెట్ పై విధి విధానాలను రూపొందించాలి. మరోవైపు బయాలజీ, తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు నిర్వహించే టెట్ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం, గణితానికి సంబంధించిన ప్రశ్నలను కూడా అడుగుతున్నారు. దీంతో అభ్యర్థులకు అర్హత సాధించడం గగనమవుతోంది. కావున ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు అధిక వెయిటేజ్ ఇవ్వాలి. టెట్ తప్పనిసరిగా ప్రతియేటా రెండుసార్లు జరపాలని ఎన్సిటిఇ పేర్కొన్నది.
కానీ చాలా రాష్ట్రాలు నిర్వహించడం లేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల సైతం మండిపడుతున్నాయి. 20 సంవత్సరాల పైన సీనియర్ ఉన్న ఉపాధ్యాయులు ప్రమోషన్కు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి. కావున ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయ విద్యను ఆధునీకరించాలి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా కరికులం చేర్చాలి. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి దూరం చేయాలి. ఎప్పటికప్పుడు వృత్యంతర శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులకు బోధనలో సాంకేతికను జోడించే విధంగా శిక్షణ అందించాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందించగలం.
Also Read: ఆ‘పన్ను’లకు ప్రయోజనమెంత?
సంపతి రమేష్ మహారాజ్
7989579428