తెలంగాణ రాష్ట్రంతో ఈశాన్య రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక పరమైన బంధాన్ని మరింతగా పటిష్ఠ పర్చేందుకుగాను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆలోచనల మేరకు తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ అనే పేరుతో రెండు విడతలుగా మూడు రోజులు చొప్పున హైదరాబాద్ లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాల నిర్వహణపై గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ గురువారం సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, సెర్ప్ సి.ఈ.ఓ దివ్య, కె. లక్ష్మీ, డైరెక్టర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, ఛీఫ్ ఫెస్టివల్ కోఆర్టినేటర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన, స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సోని బాల దేవి,
సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతిక, వైద్య, మహిళా సాధికారిత, సాంస్కృతిక, క్రీడలు తదితర కార్యక్రమాల్లో భాగంగా రెండు విడతల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 20, 21, 22 తేదీల్లో మొదటి విడత, నవంబర్ 25, 26, 27 తేదీల్లో రెండవ విడత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. దీనిలో భాగంగా తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక, సాహిత్య, మ్యూజికల్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఇరు వైపులకు సంబంధించిన ప్రముఖ సినిమాల ప్రదర్శన, మహిళా సాధికారత, అభివృద్ధి తదితర అంశాలపై చర్చా వేదికలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
Also Read: రాష్ట్రవ్యాప్తంగా మహిళా జనసమితి కమిటీలు : కోదండరాం