Friday, September 12, 2025

ఎంఎల్‌ఎల చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో జరుగుతున్న ఎంఎల్‌ఎ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం’ అని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీకి సిగ్గుందా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎంఎల్‌ఎల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న విధానాలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ‘ఓటు చోరీ’ గురించి నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ‘ఎంఎల్‌ఎల చోరీ’ గురించి మాట్లాడకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బిఆర్‌ఎస్ టికెట్లపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్‌ఎలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.

Also Read: 15 నుంచి వృత్తి విద్యా కళాశాలలు నిరవధిక బంద్

ఇంత బహిరంగంగా, సిగ్గు లేకుండా జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యాన్ని చూసి రాహుల్ గాంధీ సిగ్గుపడాలని విమర్శించారు. పార్టీ మారిన ప్రతి ఎంఎల్‌ఎను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిసి, వారితో దిగిన ఫోటోలను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. వీళ్ళను మీరు గుర్తుపట్టగలరా… అంటూ ఆ ఫోటోలను చూపిస్తూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంఎల్‌ఎలు, ఇప్పుడు తాము కాంగ్రెస్‌లో చేరలేదని చెప్పడాన్ని ప్రశ్నించారు. ‘అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు, మీరు దీన్ని ఒప్పుకుంటారా..?’ అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు. ‘ఇది ఎంఎల్‌ఎల చోరీ కాకపోతే ఇంకేమిటి?’ అంటూ రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే, ఎంఎల్‌ఎల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News