సిద్ధిపేట: గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేటలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ వన్ లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటని.. రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండని విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ లో కూర్చోబెట్టి హామీ ఇచ్చి మోసం చేశారు అని అన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని హామీ ఇఛ్చారు.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు.. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చుని హరీశ్ పేర్కొన్నారు.. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు అని అనుకుంటారు. తప్పులేదు అలా అనుకోవడంలో.. కానీ జీవితంలో మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ‘‘నా అనుభవంతో, 25 సంవత్సరాల ప్రజా జీవితంలో గమనించి చెబుతున్న మాట.. జీవిత ప్రయాణంలో మొదటి అడుగు పడడమే చాలా ముఖ్యం.. మంచి అని వెయిట్ చేస్తే జీవితంలో లేజీనేస్ పెరిగిపోతుంది. సిద్దిపేట దాటి హైదరాబాదులో ఉద్యోగం చేస్తేనే మీకు అనుభవం వస్తుంది. ఉద్యోగం కోసం మీరు ఊరుదాటి వెళితే మీకు ప్రపంచం అర్ధమవుతుంది. పోటీ ప్రపంచంలో నువ్వెక్కడున్నావు, ఎక్కడ నిలబడ్డావు, ముందుకు సాగాలంటే ఏం చేయాలనే విషయాలతో మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కష్టం యొక్క విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది’’ అని హరీశ్ (Harish Rao) తెలిపారు.
ఉన్నత ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండని యువతకు తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందో మీకు తెలవనిది కాదు.. గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడితే నిరుద్యోగులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. లక్షల రూపాయలు ఫలాన మంత్రులు, ఫలాన అధికారులు లంచం అడిగారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలి. తప్పును సరిదిద్దకుండా మరో అప్పీల్కి పోదామని చెప్పడం మూర్ఖత్వం. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. రెండేళ్లు పూర్తకావస్తున్నాయి. 2 లక్షలు ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టి మాటిచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ఏమైంది?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read : రాహుల్కు సిగ్గుందా?
ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది కేసీఆర్.. పరీక్ష నిర్వహించింది కేసీఆర్.. ఇంటర్వ్యూ నిర్వహించింది కేసీఆర్.. కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ‘‘అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా ఒక అంశాన్ని బట్టి జాబ్ క్యాలెండర్ అని పారిపోయారు. జాబ్ క్యాలెండర్ కాదు అది జాబ్ లెస్ క్యాలెండర్.. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ సభలో చెప్పించారు.. నిరుద్యోగ యువతకు నాలుగువేల నిరుద్యోగ భృతి ఇస్తామని. ఏమైంది.? ప్రభుత్వం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసింది. మీ పక్షాన మేము పోరాటం చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తాము. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తాం’’ అని హరీశ్ అన్నారు.
ఉద్యోగం పురుష లక్షణం అనేది పాత మాట. కానీ ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిందని హరీశ్ తెలిపారు. ‘‘అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో ముందు సాగుతున్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలనే ఆశయాన్ని ఈ ప్రభుత్వం నిర్వేదం చేసింది. వెటర్నరీ కాలేజ్ ని సిద్దిపేటలో పెడితే రేవంత్ రెడ్డి కొడంగల్ కి తరలించారు. సిద్దిపేటకు అన్యాయం చేశారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాము. 90% పని పూర్తయింది. ఆ చిన్న పనిని కూడా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగటివ్ డైరెక్షన్ లో ఎక్కువ వెళ్తుంది. రాజకీయాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీ భవిష్యత్తు మాకు ముఖ్యం. మీరు బాగుండాలి’’ అని హరీశ్ (Harish Rao) పేర్కొన్నారు.
మరిన్ని జాబ్ మేళాలు మీకోసం ఏర్పాటు చేస్తామని యువతకు భరోసా కల్పించారు హరీశ్. ‘‘మొన్న నేను లండన్ కి వెళ్ళినప్పుడు కూడా మన ఐటీ టవర్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలను కోరడం జరిగింది. ఈసారి ఎంతమందికి అవకాశం వస్తే అంతమంది ఉద్యోగాల్లో చేరాలని కోరుతున్నాను. దాదాపు 30 కంపెనీలు మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడికి వచ్చాయి. మీ ఆలోచన సిద్దిపేట నుండి హైదరాబాద్కి పరిమితం కావద్దు. ముంబై కో, ఢిల్లీ అక్కడి నుండి ప్రపంచవైపుకు సాగాలి. ఇతర దేశాల్లో మన దగ్గర నుంచి వెళ్లిన పిల్లలు చదువుతూ చిన్న ఉద్యోగం అయినా చేస్తూ వారి కలలను సహకారం చేసుకుంటారు. ఇక్కడ మనమూ ఈ జాబ్ చేయాలా అంటే చిన్న ఉద్యోగం చేయాలనే అనుకుంటాం కానీ అక్కడ ఉద్యోగం చేయడమే గౌరవంగా భావించి చిన్నదైనా, పెద్దదైన చేస్తూ వారి లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు కూడా మొదటి అడుగు వేయండి. పోటీ ప్రపంచంతో పోటీపడి జీవితంలో మిమ్మల్ని మీరు సాధించండి’’ అని హరీశ్ యువతకు హరీశ్ మార్గదర్శనం చేశారు.