న్యూడిల్లీ : దేశంలో క్రమం తప్పకుండా విరామాల నడుమ ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (సర్) చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల సంఘానికి ఇటువంటి చర్యకు దిగే అధికారం అనేక విధాలుగా సంక్రమించి ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానానికి ఈ మేరకు తమ కౌంటర్ అఫిడవిట్తో కూడిన ప్రతివాదనను తెలియచేశారు. ఏ ఇతర అధికారిక వ్యవస్థలకు సంబంధం లేకుండా, వాటి పరిధి రాకుండా కూడా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేసే అధికారం సంతరించుకుని ఉన్నామని ఈ వాదనలో తెలిపారు.
2026 జనవరి 1వ తేదీన క్వాలిఫైయింగ్ తేదీగా సర్ ముందస్తు సన్నాహాకాలు చేపట్టవచ్చునని ఈ ఏడాది జులై 5న రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు అధికారిక లేఖలు పంపించామని కూడా తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక లేదా ఇతరత్రా సవరణలు చేపట్టే రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన అధికారం తమకు ఉందని ఎన్నికల సంఘం తెలియచేసుకుంది. దేశవ్యాప్తంగా క్రమం తప్పకుండా అడపాదడపా ఓటర్ల జాబితా సవరణలను ఎన్నికల సంఘం చేపట్టేలా చూడాలని, నిజమైన ఓటర్లు తమ అధికారిక వ్యవస్థలను ఓటు ద్వారా ఎన్నుకునే వీలు కల్గించేలా చూడాలని న్యాయవాది అశ్విన్కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసుకున్న పిటిషన్ నేపథ్యంలో ఇసి అఫిడవిట్ వెలువడింది.