Sunday, September 14, 2025

904 టిఎంసిలు మనకే…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:కృష్ణాజలాల్లో తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ ని పుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆ దేశించారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జ లాలైనా, వరద జలాలైనా తెలంగాణాకు చెందాల్సి న నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తి లేదని సిఎం అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టిఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృ ష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై శనివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ కె.వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఇ.ఎన్.సి అంజద్ హుస్సేన్, సిఎంఓ సెక్రటరీ మాణిక్‌రాజ్, ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి, మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి న్యాయ నిపుణులకు పలు సూచనలు చేశారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలను ట్రిబ్యునల్ ఎదుట ఉంచాలని సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీఓలు, మెమోలు, డాక్యుమెంట్‌లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్‌కు అందించాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపికి 512 టిఎంసిలు కట్టబెట్టి, 299 టిఎంసిల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ 299 టిఎంసిల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఎపి ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సిఎంకు వివరించారు.

Also Read:మత్స్యకారుడి వలకు చిక్కిన వింతైన భారీ చేప

పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తోంది
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టు లను పెండింగ్‌లో పెట్టిందని, నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు కృష్ణాలో 904 టిఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సిఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహారించడంతో ఏపి ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకురావాలని సిఎం చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా రోజుకు పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తుందని, ఇతర బేసిన్‌లకు తరలించుకుపోతోందన్నారు.

జల విద్యుత్ ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం
ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపి అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్‌కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కృష్ణా నీటిని ఏపి అక్రమంగా మళ్లీంచటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వాదనలుగా వినిపించాలని సిఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సిఎం అన్నారు. సాగునీటి, త్రాగునీటి అవసరాలతో పాటు మెట్ట ప్రాంతం,

కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని సిఎం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు, కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్‌ను దిశానిర్దేశం చేసే వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని సిఎం న్యాయ నిపుణులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News