ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేసింది. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులంతా చురుకుగా పాల్గొనాలని, తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించాలని మంత్రి సీతక్క రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అందరికి లేఖలు పంపారు.
ఈ సందర్భంగా ఆదివారం మంత్రి సీతక్క ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం మొదటి అడుగు అయిన నేపథ్యంలో, ప్రతి ఇంటిలో పోషణపై చైతన్యం కల్పించడమే ఈ మాసం ప్రధాన ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఐసిడిఎస్ ప్రాజెక్టుకు రూ.30 వేలు, ప్రతి జిల్లాకు రూ.50 వేలు నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను ఉపయోగించి గ్రామస్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
జంక్ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఈ పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క ఆ ప్రకటనలో తెలిపారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు, అలాగే చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో సక్రమమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికీ పోషణ సందేశం తీసుకెళుతామని పేర్కొన్నారు. పోషణ మిషన్లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా కుటుంబాల్లో పోషకాహారంపై సమగ్ర అవగాహన కలిగించాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమని మంత్రి తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో గ్రామీణ స్థాయిలో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి ఆత్మనిర్భరతను పెంచే కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీ వినియోగంతో గ్రామస్థాయిలోనూ పోషణ డేటాను సేకరించి, వాటిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపడతామని వెల్లడించారు.
మెగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
పోషణ మాస కాలంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. పోషణ తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంలో ఈ చైతన్యం పెంపొందాలి, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసి, ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తామని అన్నారు. పోషణ మాసంలో భాగంగా ప్రతి రోజు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను సిద్దం చేసి జిల్లాలకు పంపించామని, అందుకు అనుగుణంగా ఆయా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా చురుకైన పాత్ర వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోషిత, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో ఈ పోషణ మాసం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: గ్రూపు 1 ఉద్యోగాలు రాకూడదని కెటిఆర్ కుట్ర: ఎంపి చామల