హుస్టన్: అమెరికాలోని డల్లాస్లో మోటెల్ మేనెజర్ అయిన ఓ భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది గర్హనీయం అన్నారు. దేశంలో అక్రమ రీతిలో ఉన్న ఇమిగ్రేషన్ విధానంతోనే ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమ విదేశీయుడు, ఇంతకు ముందు నేరచర్యల రికార్డు ఉన్న క్యూబా వలసదారు చేతిలోనే అత్యంత క్రూరంగా ఈ భారతీయ సంతతి వ్యక్తి హతుడు కావడం బాధాకరం అన్నారు. కర్నాటకు చెందిన 50 సంవత్సరాల చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్యను డల్లాస్లోని డౌన్టౌన్ సూట్స్ మోటెల్లోతాను అధికారిగా ఉన్న చోటనే ఈ నెల 10 వ తేదీన ఆయన భార్య, కుమారుడి ముందే అత్యంత కిరాతకంగా చంపివేశారు. నిందితుడిని 37 సంవత్సరాల యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్, క్యూబావాసి అని నిర్థారించారు.
ఈ వ్యక్తిపై హత్యానేరం పై విచారణ సాగుతోంది. హతుడి అంత్యక్రియలు రెండు రోజుల క్రితం ఆయన స్నేహితులు, సమీప బంధువుల సమక్షంలో జరిగాయి. ఆయన కుటుంబ సహాయార్థం సన్నిహితులు 321,326 డాలర్లు సేకరించి అందించారు. అక్రమ వలసలతో సాగుతున్న దౌర్జన్యాల విషయం డల్లాస్ ఘటనతో మరో సారి వెలుగులోకి వచ్చింది. సరైన విధంగా ఇమిగ్రేషన్ పాలసీ తీర్చిదిద్దాల్సి ఉందని ట్రంప్ మరో సారి తమ స్పందన వెలువరించారు. హంతకుడిని ఈ మధ్యనే అమెరికా నుంచి సొంత దేశం క్యూబాకు తరలించారు. అయితే ఆయనను అక్కడి అదికారులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు దారుణ హత్యకు పాల్పడి జైలుపాలయ్యాడు.