ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిల ఓట్లు సిఎం రేవంత్ రెడ్డి బిజెపికి అమ్ముకున్నారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అడ్డంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దొరికిపోయారని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారని..కానీ, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయని చెప్పారు. మరి 15 ఓట్లు ఎటు వెళ్లాయని అడిగారు. 15 ఓట్లు ఎవరు దొంగతనం చేశారో కాంగ్రెస్ తేల్చుకోవాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపిలు ఎన్డిఎ అభ్యర్థికి ఓట్లు వేశారని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక తాము బిజెపి అభ్యర్థికి ఓట్లు వేశామని కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ను, నితిన్ గడ్కరీని కలిశారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిశారని, క్రాస్ అయిన 15 ఓట్లలో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ భవన్లో మంగళవారం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని, చంద్రబాబుతో లింక్ పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిసి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేసినట్లు తనకు చెప్పారని అన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని…కానీ, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓట్ చోరీ చేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు.చంద్రబాబు, మోడీలకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి అభ్యర్థిని పెట్టారని..కానీ, మోడీ చెప్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓట్లు వేశారని అన్నారు. రేవంత్ రెడ్డికి అమ్ముకోవడం అలవాటు అని పేర్కొన్నారు. గ్రూప్1 పోస్టులను అమ్ముకున్నారు.. మిర్యాలగూడ ఎంఎల్ఎ గన్మెన్ యూరియాను అమ్ముకున్నారని విమర్శించారు.
సిబిఐ, ఐటి, ఇడి బిజెపి జేబు సంస్థలు అని రాహుల్ గాంధీ అంటుంటే, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అని రేవంత్ రెడ్డి వేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రులు ఎవరికి తెలియకుండా రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రినా లేక బిజెపికి ముఖ్యమంత్రా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నారని అన్నారు. మోడీకి, రేవంత్ రెడ్డికి ఒప్పందం లేకపోతే గ్రూప్1 పోస్టుల అమ్మకాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పుడు సైలెంట్ అయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నడిసముద్రంలో ముంచుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బిసిలకు ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణకు వచ్చే రాజ్యసభ సీటును పక్క రాష్ట్రం వ్యక్తికి రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
Also Read: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం : మంత్రులు సీతక్క, సురేఖ