తమిళనాడు రాజకీయ రంగస్థలం నటులతో కిటకిటలాడుతున్నది. తెలుగు రాజకీయాల మీద సినీ నటుల ప్రభావమూ, పెత్తనమూ మొదలయింది 1982లో మహానటుడు ఎన్టి రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాకనే అయినా తమిళనాడులో మాత్రం రాజకీయాలను సినిమావాళ్ళు శాసించడం నేడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి అయిదవ ముఖ్యమంత్రిగా, తమిళనాడు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన తమిళుల ఆరాధ్య నాయకుడు అన్నాదురై మొదలుకొని నేడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకె ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి వరకూ అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న సినిమావాళ్ళు ఎందరో. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటివరకు అనేక సినిమాల్లో నటించి, నిర్మించారు. తమిళనాడు వెలుపల చాలామందికి తెలియకపోయినా, ఆయన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా యువకుడుగా ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించారు.
భారత సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేరుపొందిన కమల్ హాసన్ నటుడిగా కొనసాగుతూనే ఎం.ఎన్.ఎమ్ (మక్కల్ నీది మయ్యమ్) పేరిట పార్టీ పెట్టి, రాజకీయాల్లో తన ఉనికిని కొనసాగిస్తున్నారు. ఆయన ఇటీవల రాజ్యసభకు నామినేట్ కూడా అయ్యారు. ప్రస్తుత తరం మాస్ హీరోల్లో ఒకరైన నటుడు విజయ్ జోసఫ్, ఇండస్ట్రీలో తనకు ముందున్నవారిని అనుసరిస్తూ తన రాజకీయ పార్టీ టివికె (తమిళగ వెట్రి కజగం)ని స్థాపించారు. వీరంతా వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రారంభంలోనే చెప్పుకున్నట్టు తమిళ సినిమా, రాజకీయాలు విడదీయలేనివి. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి తమిళనాడు ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది రాజకీయ నేపథ్యం కంటే సినిమారంగం నుండి వచ్చినవారే ఎక్కువ.
ఇప్పుడు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ప్రముఖ నటుడు ఈ జాబితాలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, బిజెపి, దాని మిత్రపక్షాల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. సరదాగా చెప్పాలంటే, బిజెపికి ఇప్పుడు ఇతర పార్టీలలోని స్టార్లను ఎదుర్కొనే ‘స్టార్’ క్యాంపెయినర్ దొరికాడు.గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ హిందూత్వ భావజాలానికి ప్రతినిధిగా మారిపోయారు. ఆలయాల పరిపాలన, ధర్మాదాయ శాఖల విధానాల్లో మార్పుల కోసం కృషి చేస్తూ, హిందూ మతానికి సంబంధించిన అంశాలపై బలంగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్లో కంటే తమిళనాడులోనే ఎక్కువ రాజకీయాలు చేస్తున్నట్టున్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆయన ఎప్పుడైనా మాట్లాడాల్సివస్తే మరో 20 సంవత్సరాలపాటు కూటమి అధికారంలో ఉంటుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారని, అందుకు ఆయనే సమర్థుడని ప్రకటిస్తుంటారు.
తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంకోసం ఆయన పడుతున్న తపన అందరూ చూస్తున్నారు. నాలుగు రోజులనాడు ఆయన ‘మురుగ భక్తర్గళ్ మానాడు’ అనే ఒక ఆధ్యాత్మిక సమ్మేళనానికి అతిథిగా హాజరయ్యారు. సభకు హిందూ ధార్మిక గురువులు, భారతీయ జనతా పార్టీ నాయకులతోపాటు జనం కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.భగత్ సింగ్ భక్తుడిగా, చేగువేరా శిష్యుడిగా మొదలయిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో కమ్యూనిస్టులతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన తరువాత హఠాత్తుగా సనాతన హిందూమార్గం పట్టింది. భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా పనిచేసే ఒక మత సంస్థ ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అంతా ఒక నికార్సైన సనాతన హిందూవాదిగానే సాగింది.తమిళనాడులో 2026 ఏప్రిల్ లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటివరకు అక్కడ అధికారంలోకి వచ్చినవి ప్రధానపక్షాలైన డిఎంకె లేదా ఎఐఎడిఎంకె మాత్రమే. అయితే ఒక విశేషం ఏమిటంటే ఈ రెండు పార్టీలు
ప్రతిసారి అక్కడ అధికారంలోకి వచ్చింది ఇతర పార్టీలతో కలిసి కూటమిగానే. ఒంటరిగా ఎప్పుడూ పోటీ చేసి గెలిచింది లేదు. ఎఐఎడిఎంకె మాత్రం ఒక్కసారి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చినట్టుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ.. ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు ఏదో ఒక పార్టీతో కలిసి కూటమిలో కొనసాగుతూ ఉంటాయి. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె ఇండియా కూటమిలో భాగస్వామి. బిజెపికి బద్ధ వ్యతిరేకి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం చేస్తున్న పలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నది కూడా. అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో బలోపేతం కావడంకోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ను తమిళనాడుకు తరచూ పంపుతున్నది. ఆయన తమిళనాడు పర్యటనల్లో జాతీయ విద్యావిధానం విషయంలో అధికారపక్షం డిఎంకె తీసుకున్న వైఖరిని వ్యతిరేకించడం, ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అన్న బిజెపి విధానాన్ని బలంగా ప్రచారంలో పెట్టడం, సనాతనధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా బిజెపిని ఆ రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకుల కంటే ఎక్కువ శ్రమ పడుతున్నట్టున్నాడు.
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కర్ణాటక తప్ప ఇటీవలి దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గానీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చింది లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014లో ఒకసారి, మళ్లీ ఇప్పుడు కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నా ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీయే. ఇక వామపక్షాలు బలంగా ఉన్న కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు పెద్దగా సఫలం కావడం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో అత్యంత వివాదాస్పదుడైన పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతున్నది. ఇటీవల పహల్గాం ఘటన అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన పరిణామాలను వివరించి మద్దతు కూడగట్టేందుకు ఇతర దేశాలకు పంపిన ప్రతినిధి బృందాల్లో శశిథరూర్ను చేర్చడం, ఆ పర్యటననుంచి వచ్చాక ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తడం సందేహాలకు తావిస్తున్నది.
ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన కాషాయ వస్త్రధారణలో కనిపించి, తన మతవిశ్వాసాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడువంటి రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతంలో తమ ప్రతినిధి అవుతాడని బిజెపి ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది.అంతేకాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. స్వాతంత్య్రానంతరం కొంతకాలం వరకు ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. దశాబ్దాలుగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు జనాభాను పవన్ కళ్యాణ్ ఆకర్షించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన బాల్యాన్ని చెన్నైలో గడిపారు. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఆయన అన్నయ్య చిరంజీవి కూడా అక్కడే నివాసం ఉండేవారు. అందువల్ల తమిళనాడులోని ఇతర రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్లతో పోల్చితే, పవన్ కళ్యాణ్కు తమిళ భాషతో పరిచయం ఉండటం అదనంగా కలిసొచ్చే అంశం.
ఇటీవల పవన్ కళ్యాణ్ మధురైలో హాజరయిన మురుగ భక్తుల మహాసభ.. ఆయన తమిళనాడు పర్యటనలలో మొదటిదేమీ కాదు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో సభ పెట్టి తీవ్రమైన విమర్శలు చేశారు. ఉదయనిధి పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు అని కౌంటర్ ఇచ్చారు.ఈ సంవత్సరం మొదట్లో పవన్ కళ్యాణ్ తమిళనాడు, కేరళలలో పలు ఆలయాలను సందర్శిస్తూ ‘సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకబోర్డు కావాలి’ అంటూ ప్రచారం చేశారు. ఈ పర్యటనకు ‘సనాతన ధర్మ యాత్ర’ అని పేరు కూడా పెట్టారు. ఆయన్ని కాషాయ వస్త్రధారణలో జనం ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి చోటా చూశారు. బిజెపి ప్రభావం తక్కువగా ఉన్న ఈ రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు ఇది ఆయన చేసిన ప్రయత్నంగా భావించాలి . ప్రముఖ విశ్లేషకుడు, ‘తుగ్లక్’ తమిళ పత్రిక సంపాదకుడు ఎస్. గురుమూర్తి ఒక టివి ఇంటర్వ్యూలో చెప్పినట్టు పవన్ తమిళనాడులో అత్యధికంగా ఉన్న తెలుగు జనాభాను బిజెపి వైపు ఆకర్షించడానికి తన సందేశాన్ని బలంగా వినిపించగలడేమో చూడాలి.
తాజాగా జరిగిన మధురై పర్యటనలో ఆయన తన మతపరమైన విశ్వాసాలపై, తమిళనాడుతో ఉన్న అనుబంధంపై ప్రసంగించారు. తన చిన్నతనంలో శబరిమల వెళ్లిన విషయాన్ని, నుదిటిపై విభూతి రాసుకుని స్కూలుకు వెళ్లిన విషయాలను చెప్పారు. తమిళనాడు సంస్కృతిపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. మధురై ఆలయాన్ని 14వ శతాబ్దంలో మాలిక్ కఫూర్ ఎలా ధ్వంసం చేశాడో, తరువాత విజయనగర సామ్రాజ్యంలో ఒక రాజు ఆ ఆలయాన్ని తిరిగి ఎలా ప్రారంభించాడో చెప్పారు. ఆయన ప్రసంగం ద్వారా హిందూ అస్తిత్వాన్ని, సంస్కృతిని రక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రసంగం బిజెపికి అనుకూలంగా ఓటర్లను ఆకర్షించడానికి జరిగిన ప్రయత్నంగా చెప్పవచ్చు. ఆయనతో ఇతర బిజెపి నాయకులు వేదికపై ఉన్నారు. తమిళనాడు ద్రవిడ రాజకీయాల చుట్టూ తిరుగుతుందన్న విషయం పరిగణనలోకి తీసుకుంటే, బిజెపి లేదా ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న కొత్త వ్యూహాన్ని తమిళ ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చెప్పడం కష్టం.
అయితే, ఆయన ప్రసంగానికి ప్రతికూలంగా వచ్చిన విమర్శలు కూడా తక్కువేమీ కాదు. ‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప పాత్రతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సీనియర్ నటుడు సత్యరాజ్, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడవద్దని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ను, బిజెపిని ఉద్దేశించినవే. సత్యరాజ్ డిఎంకె శిబిరానికి చెందినవాడు. ఆయన కుమార్తె ఇటీవలే డిఎంకెలో చేరారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో పవన్ను బిజెపి వాడుకుని వదిలేస్తుందన్న అర్థం వచ్చేట్టు మాట్లాడారు. ‘ముంబయి లోకల్ రైల్లో ప్రయాణికుడు ఎక్కాల్సిన పని లేదు. రద్దీలో జనం తోసేస్తే రైల్లో పడతాడు, తరువాత వాళ్ళే బయటికి కూడా తోసేస్తారు’ అంటూ, పవన్ విషయంలో బిజెపి చేసేది అదేనన్నారు. ఇందులో ఎవరు ఎవరిని వాడుకుంటున్నారో చూడాలి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు బిజెపి పవన్ కళ్యాణ్తో చేసిన ఈ ప్రయోగం ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఇది దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దయెత్తున చర్చకు మాత్రం తెరలేపింది.
బిజెపికి ఇటు తెలంగాణలోనూ అధికారంమీద ఆశలు పెరుగుతున్నాయి. జులై ఒకటిన రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే ఏర్పాట్లలో ఉన్నది. ఏడాది క్రితమే కాంగ్రెస్తో సమానంగా ఎనిమిది లోకసభ స్థానాలు గెలుచుకుని, అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులుగా నియమించుకుని అధికారంకోసం విశ్వప్రయత్నాలు చెయ్యడానికి సిద్ధం అవుతున్నది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొని అధికారం సాధించడం అంత సులభమయిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా కూటమి కట్టే అవకాశం తెలంగాణలో తక్కువ. కాంగ్రెస్ ఎలాగూ కలిసిరాదు. బిఆర్ ఎస్తో పొత్తు ఉంటుందన్న ప్రచారం ఎంతవరకు నిజమో ఇప్పుడే తెలియదు. ఏదిఏమైనా కర్నాటకలో పూర్వ వైభవం తిరిగి సాధించి, మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలన్న బృహత్ ప్రణాళికలు బిజెపికి ఉన్నట్టే అర్థం అవుతున్నది.