Monday, June 9, 2025

పాల కడలిలో వెండి పడవ

- Advertisement -
- Advertisement -

ప్రతి కవికొక జన్మ వృత్తాంతం ఉంటుంది. తన కవిత్వంతో మన హృదయ గవాక్షాలు తెరచి తనని తాను పరిచయం చేసుకొని, తత్‌క్షణమే మనకి చిరపరిచితుడై మనఃఫలకం మీద స్థిరపడిపోతాడు కవి అనేవాడు. ఉమర్ అలీ షా కూడా నాకు అలా పరిచయమైన కవే. 1982 ప్రాంతంలో నేను కాకినాడలో మెడిసిన్ చదువుతున్న రోజుల్లో ఇస్మాయిల్ కవి గారిని తరచూ సందర్శించటం, ఆయనతో కవిత్వ విషయాల్ని చర్చించటం జరిగేది. ఇస్మాయిల్ వాళ్లింటి లివింగ్ రూమ్‌లో కృష్ణశాస్త్రి ఫొటో దాంతో పాటు ఇంకో ఫొటో కూడా ప్రముఖంగా కనపడుతూ ఉండేది. ఆ వ్యక్తి ఎవరనేది నాకు కలిగిన సందేహం. ఆయనే కవి ఉమర్ అలీషా అని ఇస్మాయిల్ ద్వారా తెలుసుకున్నాను. కృష్ణశాస్త్రి గురుతుల్యుడైతే, ఉమర్ అలీషా ఇస్మాయిల్‌కి దూరపు బంధువు.
శ్రీశ్రీ గారి జన్మ వృత్తాంతం గురించి ఒకచోట ఇస్మాయిల్ గారు వివరించిన విధంగానే, ఉమర్ అలీషా గారి జన్మ వృత్తాంతం నా అనుభవానికి అందింది. మనకాలపు మహాకవి ఇస్మాయిల్ జీవితాన్ని, కవిత్వాన్ని ఇతివృత్తంగా తీసుకొని నేను రాసిన ‘నది కాలం అతడు’ కవితా సంపుటిలో ఉమర్ అలీషా గురించి కూడా ఒక కవితని రాశాను.

ఉమర్ అలీషా కూడా పిఠాపురం వాడే కృష్ణశాస్త్రి లాగా, ఉమర్ అలీషా 1885లో, కృష్ణశాస్త్రి 1897లో జన్మించారు. వయసు విషయంలో ఇద్దరి మధ్యా 12ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఉమర్ అలీషాకి, కృష్ణశాస్త్రికి మధ్య పోలిక ఏమిటంటే, కాలాలు వేరైనా ఇద్దరూ ప్రకృతిని ప్రేమించారు. భక్తి కవులు చూపిన దారుల్లో నడిచారు. రొమాంటిసిజం ఛాయలతో కూడిన కవిత్వం రాశారు. ఈ రొమాంటిసిజంనే తెలుగులో ‘భావకవిత్వం’ అన్నారు తదనంతర కాలంలో.
రొమాంటిసిజం పాశ్చాత్య కవిత్వంలో ఉధృతంగా వస్తున్న కాలంలో ఉమర్ అలీషా అటువంటి కవిత్వాన్ని ఎంతో శక్తిమంతంగా రాశారు. అంతర్జాతీయ కవిగా గుర్తింపులోకి వచ్చారు.
ఉదాహరణకి, ఆకాంక్ష పద్య ఖండం:
“వెడలి పోయెద నీ విశ్వవీధి విడిచి
కడచి పోయెద నక్షత్ర గతులు మీరి
పారి పోయెద బైలోక పథములకును
నడచి పోయెద నల గగ నాలు దాటి

నన్నుగని యేడ్చు వారలెందున్న వారు
నన్ను దలపోయు వారలెందున్న వారు
నా మరణ మహా జ్వాలలో నా మహాప్రభా
ప్రళయ దందహ్య మానమాని
తాగ్ని నెవ్వారు కాలి వెన్నాడగలరు?
బాష్ప కణములు నా పైని రాల్చి
ఆరుపగ వచ్చువారలున్నారె జగతి”
తన ప్రాంతం వాడూ, తనకి పెద్దన్న లాంటి వాడూ అయిన ఉమర్ అలీషా ప్రభావం కృష్ణశాస్త్రి మీద కచ్చితంగా ఉంది. ఉదాహరణకి, కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ గేయం..
“ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా..
ఎటులైనా ఇచటనే ఆగిపోనా”
నడకలో కానీ, భావంలో కానీ ఉమర్ అలీషా -‘సంశయం ‘గేయానికి అనుసరణగా సాగుతుంది.
ఈ చెట్లు.. ఈ తీగ..
చేల ఈ పూలు.. ఈ చిత్ర చిత్రాల
జూచినే నాగిపోనా? వేచి నే కలసిపోనా?
ఉమర్ అలీషా 1908 నించి 1944 వరకు అంటే జీవితపు చివరి గడియల వరకు విస్తృతంగా కవిత్వం రాస్తూనే ఉన్నట్టు ఆనాటి సాహిత్య పత్రికల ద్వారా తెలుస్తోంది. భావ కవిత్వం, అభ్యుద య కవిత్వం లాంటి ప్రక్రియ ఉద్యమాలు రాకముందే భావ కవిత్వమే కాదూ అభ్యుదయ కవిత్వమూ రాశాడు ఉమర్ అలీషా.
“కూటికి మోము వాచి
పసి కూనలలో యేడ్చు నిండ్లు నా
నాటికి హెచ్చుచున్నవి;
దినంబు యుగంబును బోలె దోచునే
చోటికి బోయి నన్ కడుపు
చుమ్మలు చుట్టుకు పోవుచుండెనీ
కాటకమందు జెందు కడ గండ్లిక
దప్పవె క్షామ దేవతా!”
అంటూ పేద పసిపిల్లల ఆకలి దప్పుల గురించి ఆక్రోశించాడు అలీషా. ఇంకో పద్యంలో ఇలా అంటాడాయన.
మావారి రక్తంబు, మావారి కండలు
మావారి ప్రాణాలు, ఈ నేల బలివేసి
ఈ భూమి తెగకోసి ఈ పొలములో దోసి
మేము గడియించి,
యిట మేము నివసించి
పండించినాము యీ ఎండిపోయిన
బీళ్లు ఖండించినాము ‘దోర్థండ రక్కసి రాళ్ల
నిండించితిమి ప్రేమ రసవాహినుల..’
అని. అంతేనా, సమాజం పట్ల నిబద్ధత కవి బాధ్యత అని కూడా ఉద్బోధించాడు ఉమర్ అలీషా ఆ రోజుల్లోనే.
నీవు నీ ప్రతిజ్ఞను దాటి పోవ జనదు
దాస్య శృంఖలలను జీవితంబు గడపి
ధన మదాంధుల కొలువు
బంధనములందు
జిక్కి యాత్మీయ వ్యక్తిని దక్కి స్రుక్కి
నీ మనోభావ ముల జంపి కామ మోహి
వగుచు నజ్ఞాన ఘోర గాఢాంధకార
మందు జిక్కి యదే తల క్రిందులైతి
వింక పైకి వచ్చెడు దారి యేది నీకు
అంటూ వొక ఆగ్రహ ప్రకటనగా సాగిపో తుంది యీ ‘మోక్ష గీతి’ అనే కవితా ఖండిక. తన ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి’ అని అన్నా డు. కానీ, అంతకుముందే ఉమర్ అలీషా చం ద్రుణ్ణి
దర్పకుడు వచ్చి వంచిన ధనువువలెను
పాల కడలి లోపలి వెండి పడవ వలెను
ప్రకృతి కన్య త్రావెడు పాన పాత్రవలెను

నభముపై దోచె రెండవనాటి విభుడు అని అన్నాడు. ఉమర్ అలీషా మరణానంతరం అందు బాటులో ఉన్న ఆయన కవిత్వాన్ని ఖండకావ్యము లు పేరిట 1950లో మొదట అచ్చు వేశారు ఉమర్ అలీషా మిత్రులు! 2010 నాటికి ఈ కావ్యం నాలు గు పునర్‌ముద్రణలని పొందింది. అయితే, ఉమర్ అలీషా రాసిన అనేక ఖండకావ్యాలు ఇవాళ్టికీ అల భ్యంగానే ఉండిపోయాయి. ఉమర్ అలీషా తన మానాన తాను కవిత్వం రాస్తూ పోయాడు కానీ.. కీర్తీ, కనకం కోసం పాకులాడ లేదు. రాసిన కవి త్వాన్ని సైతం పదిలపర్చుకోలేదు. ఉమర్ అలీషా సంస్కృతాంధ్ర భాషల్ని క్షుణ్ణంగా చదువుకున్నా డు. ఉర్దూ, అరబ్బీ, పారశీక భాషల్లో నిష్ణాతుడా యన. ఈ భాషలన్నింటిలో కవిత్వం రాశాడు. ‘ఉ మర్ ఖయాం’ కావ్యాన్ని నేరుగా పారశీక భాష నుంచే తెలుగులోకి అనుసృజించాడు ఉమర్ అలీ షా. ఆ రుబాయీలు 1921 ప్రాంతంలో భారతి పత్రికలో అచ్చైనాయి. అలీషాకి ఆంగ్ల కవిత్వం తోనూ పరిచయముంది. ఉమర్ అలీషా పద్యాల అల్లికలో గొప్పసౌందర్యం ఉట్టిపడుతుం టుంది.

మేఘమాలికలో దోచు మెరపు చూచి
పసవ సౌరభములు జల్లు వనమూ జూచి
పూల పైని సీతాకోక పురుగు జూచి
నెమలి పురివిప్పి యాడెడు కొమర చూచి
భవ్య శారద రాత్రి వైభవము గాంచి
పాడెడు వసంత కోకిల స్వరము గాంచి
పలుకు కవికి సదా వాని కలమునకును
కావ్య కాంతకు నా నమస్కార శతము”

ఈ ప్రాచీన ధోరణి పద్యం ఏ ఆధునిక వచన కవితకి తీసిపోదు. వేరే ఇంకెవరితోనూ పోల్చటా నికి వీల్లేని ఈ విశిష్ట కవిని ఆనాటి సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగా విస్మరించింది. 1935లో ముద్దుకృష్ణ సంపాదకత్వంలో వచ్చిన ‘వైతాళికు లు’ కవితా సంకలనంలో అత్యంత ప్రతిభావంతు లైన ముగ్గురు కవుల పద్యాలకి చోటివ్వలేదు. ఆ క వులు – ఉమర్ అలీషా, జాషువా, త్రిపురనేని రామ స్వామి చౌదరి. వైతాళికులు కవితా సంకలనంలో లేకున్నా ఈ మువ్వురూ ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికులుగా పరిగణనలోకి రావటం ఒక చారిత్ర క విశేషం. ఏదేమైనా.. కవిగా ఉమర్ అలీషా అం దుకున్న శిఖరాలూ, చేరుకున్న ఎత్తులూ అనితర సాధ్యం. సాహిత్యంలోని సమస్త ప్రక్రియల్ని స్పృ శించిన అద్భుత కవి వతంసుడు ఉమర్ అలీషా! ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో కవిగా అతడి స్థానం సుస్థిరం. తెలుగు సాహిత్య చరిత్ర పుటల్లో ఉమర్ అలీషా దొక చెరిగిపోని సంతకం.
డా.రవూఫ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News