Monday, June 30, 2025

తూరుపు గాలి.. ప్రసాద్ సూరి

- Advertisement -
- Advertisement -

లిటరరీ సర్కిల్స్‌లో ఇప్పుడు వినిపిస్తున్న పేరు ప్రసాద్ సూరి. విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర రాంబిల్లి అనే చిన్న గ్రామం. అంతా చేపలు పట్టే వాళ్లే. అక్కడ పుట్టిన ‘జలపుష్పం’ పేరే ప్రసాద్ సూరి. సాహిత్య సాగరంలో ఈదడం ఈ చేప పిల్లకి సరదా మాత్రమే కాదు. ఒక ఫ్యాషన్. ఒక అబ్సెషన్. 23 ఏళ్లకే మూడు నవలలు రాశాడు. ‘తూర్పు పవనం వీచెనోయ్’ అన్నట్లు అవి ఒక కొత్త అనుభూతిని పంచి ఇచ్చాయి. పదో తరగతి చదువుతున్నప్పుడు ఎలమంచిలిలో ఒక దరిద్రపు గొట్టు బీసీ హాస్టల్‌లో ఉన్నాడు. మురికిలో పేదరికంలో, చీకటిలో, దోమలతో స్నేహంలోని సరదాలని ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి’ అనే నవలగా రాశా డు. అది తొలి నవల. నవయవ్వనపు ఆత్రుతనీ, తలతిక్కనీ అంతే సహజంగా, నిజాయితీగా, నిర్భయంగా, కూడా రాశాడు. చదివిన వాళ్లు ఈ కొత్తదనాన్ని ఎంజాయ్ చేశారు. ఈ బెస్త కుటుంబాలు ఒకనాడు ఓడలు తయారుచేసేవి. క్రమంగా చేపలు పట్టుకునే వాళ్ళుగా మిగిలారు.

ఎందుకు ఇలా జరిగింది? క్యూరియాసిటీతో తెలుసుకున్నాడు ప్రసాద్. వీళ్లది వాడ బలిజ కులం. బెస్తలూ, గంగపుత్రులూ వేరే. అమ్మమ్మలూ, నానమ్మలూ, చరిత్ర తెలిసిన పెద్దలు చెప్పినవి రికార్డు చేసుకున్నాడు. చరిత్ర, సొంత అనుభవం, ఇప్పటి దగుల్బాజీ రాజకీయాలూ, గ్రామీణ జీవితంలోని విషాదము కలిపి ‘మైరావణ’ అనే నవల రాశాడు. రివ్వున దూసుకుపోయే గుర్రాల్లా ప్రసాద్ వచనం వేగంగా చదివిస్తుంది. డ్రామా, మ్యాజిక్ రియలిజం కలిపి సాహస వీరుడు మైరావణుని జానపద హీరోగా, ఒక విజువల్ బ్యూటీని నీలి సముద్రం ఒడ్డున పరిచిన జీవన సౌందర్యం పాఠకుడ్ని ఊపేస్తుంది. అందుకేనేమో కేంద్ర సాహి త్య అకాడమీ యువ పురస్కారం దక్కింది ఈ నవలకి.ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన ప్రసాద్, మాసాబ్ ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్ కాలేజీలో చేరి, నాలుగేళ్ల కోర్సు పూర్తి చేశాడు. ఇప్పుడు బరోడాలో ఆర్కియాలజీ పీజీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు.

హైదరాబాద్ అనుభవాల కళాత్మక వ్యక్తీకరణతో ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ట్’ అనే మూడో నవల రాశాడు. కథ, కవిత రాయడం వేరు. నవల కాన్వాసు చాలా పెద్దది. దానికో స్కీము, కుట్ర, దమ్ము, అతి తెలివిలాంటివన్నీ ఉండాలి. అన్నింటినీ కలిపి కుమ్మేశాడు ప్రసాద్. ఉత్తభిరుచి, తెగ చదివే అలవాటు ఈ కుర్రాడి కోర్ స్ట్రెంత్. కెరటాల మీద పడవ వెళుతున్నంత హాయిగా ఉంటాయి అతని వాక్యాలు. పగలూ, రాత్రీ చదివే దురలవాటు వల్ల మంచి తెలుగు వచనం అతని ఇంట్లోకొచ్చి సెటిలైపోయింది. బంకోల, బోయ కొట్టములు పన్నెండ్రు నుంచి, పొన్నియన్ సెల్వ న్, గ్రేగరీ డేవిడ్ రాబర్ట్, ‘శాంతారామ్’ చదివి ఉన్నాడు.అమితావ్ ఘోష్ ట్రియాలజీ, సీ ఆఫ్ పాపిస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్, ప్రసాద్‌ని కుదిపివేశాయి. ‘ఈ తరం చదవడం మానేసింది’ ఫిర్యాదులకు ప్రసాద్ సూరి ఒక తిరుగులేని మినహాయింపు.

ఒక రకంగా అలెక్స్ హేలీ ‘రూట్స్’ లాగానే తన మూలాల్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లి కన్నీళ్ళ పర్యంతం కావడమే ‘మైరావణ’. ‘బెస్తవారి నిజ జీవితాన్ని తెలుగులో ఈ నవలే తొలిసారిగా స్పష్టంగా చిత్రీస్తోంది’ అన్నాడు స్టార్ రైటర్ సోలొ మెన్ విజయ్ కుమార్. ప్రసాద్‌కి రాయడం ఒక దీక్ష. నిరంతర చదువు ఒక వ్యసనం. బొమ్మలు బాగా వేయడం అలవోకగా అందివచ్చిన కళ. ఇట్స్ ఏ డెడ్లీ కాంబో. 25 సంవత్సరాలకే తగిన గుర్తింపు పొందాడు. చదువు లేని, అక్షరం ముక్క రాని, పేద కుటుంబం నుంచి సృజనాత్మక రచయిత రావడం సాధ్యమేనా? ఎందుక్కాదు అంటున్నాడు ప్రసాద్. నా జాతి జనుల జీవితం గురించి మరింత అధ్యయనం చేసి రాస్తాను అని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు ఈ బాయ్ వండర్.
తాడి ప్రకాష్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News