Thursday, June 26, 2025

ఐఎఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు ఎసిబి నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఫార్ములా..ఈ కార్ రేస్ కేసులో జూలై 1న విచారణకు హాజరుకావాలని సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు బుధవారం ఎసిబి నోటీసులు జారీ చేసింది. అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఈ కేసులో ఏ2 నిందితునిగా ఎసిబి నమోదు చేసిన విషయం తెలిసిందే. అరవింద్ కుమార్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన సెలవులో ఉండటంతో జూలై 1న విచారణకు హాజరుకావాల్సిందిగా ఎసిబి నోటీసు జారీ చేసింది. తన కూతురు కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కావడం కోసం ఆయన యూరప్ వెళ్ళారు. ఫార్ములా ఈ రేస్ కార్ నిర్వహణా ఒప్పందంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై జనవరిలో ఎసిబి విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఇడి కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

కాగా ఐదు నెలల విరామం తరువాత ఈ నెల 16వ తేదీన అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌ను ఎసిబి విచారించింది. ఈ కేసులో ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఎసిబి కెటిఆర్‌ను విచారించింది. అలాగే ఈ కేసులో ఎసిబి అధికారులు ఈ కార్ నిర్వహణకు సంబంధించిన ఆర్ధిక శాఖ అనుమతులు, నియమ నిబంధనలు, స్పాన్సర్ల వివరాలు తదితర అంశాలపై కీలక సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్‌కు తాజాగా నోటిసులు ఇవ్వడంతో ఈ కేసులో ఎసిబి వేగం పెంచినట్టు అయింది. ఇటీవల కెటిఆర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అరవింద్ కుమార్‌ను ఎసిబి విచారించనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News