Sunday, June 29, 2025

తెలుగు భాషకు వెలుగు దివ్వె

- Advertisement -
- Advertisement -

ఆయన తెలుగు సాహిత్యంలో బహుముఖీన ప్రతిభా సంపన్నులు, వివిధ సాహితీ ప్రక్రియల్లో అందెవేసిన చేయి. ఆయన ఉత్తమ తెలుగు ఆచార్యులు, పరిశోధకులు, పర్యవేక్షకులు, పరిపాలనదక్షులు, నిఘంటుకారులు. సప్రమాణంగా, సాధికారికంగా, సోదాహరణంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా రచించడం ఆయన సొంతం, ప్రత్యేకత కూడా. ఆంధ్ర యూనివర్శిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగానేకాక వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాక హైదరాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరు (1985)గా, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉపాధ్యక్షులు (1986-88)గా విశ్వవిద్యాలయానికి దిశానిర్దేశం చేశారు. ఆయనే పుట్టపర్తి సాయిబాబాచే తెలుగు పండితుడు అని ప్రశంసలు అందుకున్న ఆచార్య తూమాటి దొణప్ప.

ఆచార్య దొణప్ప తెలుగు సాహితీ విజ్ఞాన గని. ఆయన బహుభాషా పండితులు- తెలుగు, ఇంగ్లీషు, కన్నడం, సంస్కృతం భాషల్లో నిష్ణాతులు. ఆయన కలంనుండి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రచనా స్రవంతి జాలువారింది. ఆయన సాహితీ ప్రస్థానం తరగతి గదిలోనూ, పత్రికా రంగంలోనూ, ఆకాశవాణి ప్రసంగాలుగానూ ముప్పేటలుగా సాగింది. ఆయన గ్రంథిక భాషావాది, ఆచరణశీలి కూడా. ఆయన రచనల్లో అరసున్న (ఁ), బండిర అదే శకట రేఫం సాక్షాత్కరిస్తాయి. రచనా ప్రవాహంలో సాగిపోతాయి. అంతేకాక నామవాచకాలు, క్రియారూపాలు కూడా గ్రాంథికాన్నే తలపిస్తాయి. పరిశోధన కూడా కవితాత్మకంగా సాగిపోతుంది. ఎడనెడ వాక్యం ప్రాసాత్మకంగా కూడా సాగిపోతుంది. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీ వేత్తలు ప్రతితరంలోనూ శతాధికంగానే ఉన్నారు. ఆయన శత జయంతి వేడుకలు జరిపి, ఆయన సేవలను స్మరించి, నివాళులు అర్పిస్తోంది తెలుగు సాహితీ జగత్తు. అందుకు మనమందరం సంతోషించాలి, గర్వించాలి.

ఈ నేపథ్యంలోనే ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి వేడుకల ప్రారంభానికి హైదరాబాదు వేదిక అవుతోంది. ఆచార్య దొణప్ప శిష్యులు, ఆయన సహోద్యోగులు, ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి కమిటి ఏర్పాటయింది. ఆయన శత జయంతి ఉత్సవాలు ‘శత జయంతి కమిటి’, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త సహకారంతో జులై ఒకటిన ప్రారంభమవుతాయి. ఆనాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి, హైదరాబాదు)లో సభ జరుగుతోంది. ఆచార్య తూమాటి దొణప్ప వ్యాస భారతి అనే సంపుటాన్ని ఆవిష్కరించడమవుతుంది. అందులో ఆయన రచించిన వ్యాసాలు 11 ఉన్నాయి. ఇందులో ఆయన అముద్రిత రచనలు చోటుచేసుకున్నాయి. ఈ విధంగా దొణప్పను స్మరించి, అక్షర నివాళులు అర్పించడమవుతుంది.

ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి వేడుకులు సంవత్సరం పొడుగునా (జులై 2025 నుండి జులై 2026 వరకు) జరపాలని కమిటీ నిశ్చయించింది. అంటే 2025 జులై 1నాడు ప్రారంభించి, వచ్చే సంవత్సరం 2026 జులై 1 వరకు జరుగుతాయి. ఈ సంవత్సరమంతా ఆయనను గుర్తు చేసుకుంటూ, దేశంలోని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖల్లో ఆయనపై సదస్సులు నిర్వహించడమవుతుంది. ఇప్పటికే సుమారు 11 విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి. దొణప్ప సప్రమాణంగా, సాధికారికంగా, సోదాహరణంగా 8 పరిశోధన గ్రంథాలను ప్రచురించారు. అవి- 1. ఆంధ్ర సంస్థానములు-సాహిత్య పోషణము (1989), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథం, 2. భాషా చారిత్రక వ్యాసావళి, 3. తెలుగులో కొత్త వెలుగులు (1972), 4. జానపద కళాసంపద, 5. తెలుగు హరికథా సర్వస్వం, 6. తెలుగు వైకృత పదనిరూపణము, 7. ఆకాశ భారతి, 8. బాలల శబ్దరత్నాకరం. అంతేకాక 1. తెలుగు వ్యుత్పత్తి పదకోశం, 2. త్రివేణి, 3. మాండలిక వృత్తిపదకోశం, 4. అన్వేషణ పత్రిక (నాగార్జున విశ్వవిద్యాలయం), 5. Journal of Telugu Studies (Published by Telugu University), మొదలైన గ్రంథాలకు సంపాదకులుగా వ్యవహరించారు. అయితే తెలుగు సాహితీ లోకానికి అందని సుమారు మూడు వేల పుటల లిఖితప్రతులు, టైపుప్రతులు ఉన్నాయని ఆయన కుమారుడు సుధాకర్ తెలిపారు. వాటిని సాకల్యంగా పరిశీలించి, పాఠక లోకానికి అందించాలనే దృఢ సంకల్పంతో ఉంది కమిటీ.

ప్రస్తుతానికి ఆచార్య తూమాటి దొణప్ప- వ్యాసభారతి అనే సంపుటం వెలుగు చూస్తోంది. ఇంకా కొన్ని గ్రంథాలు ప్రచురణకు రూపు దిద్దుకుంటున్నాయి, ముస్తాబు అవుతున్నాయి. ‘పూవు పుట్టగనే పరిమళిస్తుంది’ అనే సూక్తి ఆయనకు అక్షరాలా వర్తిస్తుంది. ఆయన బాల్యం చదువు సంధ్యలతోపాటు ఆశుకవిత్వ గానం, నాటకాల్లో నటించడం, కథలు రాసి ప్రచురించడం అనే త్రివేణిలా భాసించింది. ఆయన జీవితం ప్రధానంగా రాకట్ల, వజ్రకరూరు, ఉరవకొండ, అనంతపురం, విశాఖపట్నం, పుణె, గుంటూరు, హైదరాబాదు అనే ఎనిమిది ప్రాంతాల్లో వెల్లివిరిసింది. తూమాటి దొణప్పను బాల్యంలో దొణ తిమ్మారాయ చౌదరి అని పిలిచారు. ఆ తరువాత తూమాటి దొణప్పగా స్థిరపడింది. అనంతపురం జిల్లా, రాకట్ల గ్రామంలో జులై 1, 1926లో జన్మించారు. తూమాటి సంజీవప్ప, తిమ్మక్క దంపతుల పది మంది సంతానంలో దొణప్ప ఎనిమిదో సంతానం. బాల్యంలోనే తాత గారైన తూమాటి భీమప్ప దగ్గర సంస్కృతం అభ్యసించారు. విద్యార్థి దశలోనే ఆశుకవిత్వం చెప్పారు. నాటకాల్లో నటించారు. సృజనాత్మక రచనలు వెలువరించారు. ఆయన రాకట్లలో ప్రాథమిక విద్య (1931 -38), వజ్రకరూరులో మాధ్యమిక విద్య (1939- 42) అభ్యసించారు, విద్యార్థిగా నాటకాల్లో పాత్రలు ధరించి, బహుమతులు కూడా స్వీకరించారు. ఉరవకొండలో మాధ్యమికోన్నత పాఠశాల విద్య (1943-48) ను గడించారు.

1946లో ఎస్.ఎస్.ఎల్.సి. ఉత్తీర్ణుడయ్యారు. ఎనిమిదవ తరగతిలో ఉండగానే కథలు రాసి పత్రికలలో ప్రచురించారు, అంతేకాక ఆశుకవిత్వం చెప్పడం ప్రారంభించారు. అనంతపురంలో దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియెట్ (1946- 48) విద్యనభ్యసించారు. ఆ పిమ్మట విశాఖపట్నంలో 1949–, 1952 మధ్యలో బి.ఎ. ఆనర్స్, 1953లో ఎం.ఎ. ఆనర్సులో బంగారు పతకం పొందారు. అదే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి, తెలుగులో వైకృత పదాలు అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి, 1966లో పిపెచ్.డి. పట్టా పొందారు. దొణప్ప ఆంధ్ర యూనివర్శిటీ తెలుగు శాఖలో ఉపన్యాసకులుగా 1958లో చేరారు. అంతేకాక తెలుగు వ్యుత్పత్తి పదకోశంలో 1970 నుండి 76 వరకు పని చేశారు. ఆ పిమ్మట ఆయన గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయానికి మారారు.

అక్కడ తెలుగు శాఖాధిపతిగా, కళాశాల ప్రిన్సిపాల్ (1983- 85)గా, ఆ యూనివర్సిటీ రిజిస్ట్రారుగా పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగ ప్రస్థానం హైదరాబాదుకు మారింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1985లో స్థాపించిన తెలుగు విజ్ఞాన పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆ పిమ్మట 1986 జనవరి 8వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా చేశారు. విశ్వవిద్యాలయ దిశానిర్దేశానికి కృషిచేశారు. ఆ తరువాత అధికార భాషా సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. దొణప్పకు 1953 ఆగస్టు 29వ తేదీన గోవిందమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. సుధాకర్ అనే కుమారుడు, అనురాధ, సునీత అనే కుమార్తెలు. ఆచార్య దొణప్ప 6 సెప్టెంబరు 1996 తేదీన పరమపదించారు. తూమాటి మృదుస్వభావి, శాంతచిత్తులు, అయితే చాలా గంభీరంగా కనిపిస్తారు. ఆయన గంభీరంగా పాఠం చెప్పినా కానీ మధ్యలో సున్నితంగా చెణుకులు, విసుర్లు విసురుతుంటారు. ఆయన వద్ద చదివిన శిష్యులు ప్రశిష్యులు సమున్నత పదవులను కూడా అధిరోహించారు.

ఆచార్య పగడాల చంద్రశేఖర్
94908 03523

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News