టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయనను కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్. ముషీరాబాద్ చేపల వ్యాపారంతో పిష్ వెంకట్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
రాంనగర్లో నివాసం ఉంటున్న వెంకట్ నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఆయన్ను నటుడిగా పరిచయం చేశారు. వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్తుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, గబ్బర్సింగ్, డీజె టిల్లు, కింగ్, డాన్ శీను, మిరపకాయ్, సుప్రీమ్, దరువు తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ చిత్రంలో నటించారు.